సిఫార్సులకే పెద్దపీట !
ABN , First Publish Date - 2020-10-27T10:11:14+05:30 IST
డ్వామా ఉద్యోగుల బదిలీల్లో సిఫార్సులకు పెద్దపీట వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
డ్వామా ఉద్యోగుల బదిలీల్లో వింత
ఏపీఓలు, ఈసీ, కంప్యూటర్ ఆపరేటర్లకు కౌన్సెలింగ్
అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 26 : డ్వామా ఉద్యోగుల బదిలీల్లో సిఫార్సులకు పెద్దపీట వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేతల సిఫార్సులు తూ.చా. తప్పకుండా అమలు చేశారన్న వాదనలున్నాయి. ఆ మేరకు బదిలీల జాబితాను సిద్ధం చేసినట్టు సమాచా రం. సోమవారం తొలి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏపీఓలు, ఆ తర్వాత రాత్రి వరకు ఈసీ/జేఈ, కంప్యూటర్ ఆపరేటర్లకు బదిలీల కౌన్సెలింగ్ జరిగింది. మూడేళ్లకుపైగా ఒకే స్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు సొంత మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిబంధనలు విధించారు. మూడేళ్లు పూర్తైన ఉద్యోగులు, సిబ్బందికి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆప్షన్లు తీసుకున్నారు.
అయితే ముందస్తుగా ఎవరి స్థాయిలో వారు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల నుంచి సిఫార్సులు చేయించినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో కొన్ని స్థానాలకు ముందస్తుగా నిర్దేశించిన వారినే పంపించేలా ప్రణాళికలు రూపొందించినట్లు విమర్శలున్నాయి. మంగళవారం టెక్నికల్ అసిస్టెంట్లు, ఐడబ్ల్యూఎంపీ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
తాజా బదిలీల్లో మరో కొత్త సమస్య
డ్వామాలో నిర్వహించే తాజా బదిలీల్లో మరో కొత్త సమస్య తెరపైకి వచ్చింది. జిల్లాలోని 63 మండలాలకు ఒక్కో మండలానికి ఏపీఓను నియమించాల్సి ఉంది. డ్వామాలో 74 మంది దాకా ఏపీఓలున్నారు. గతంలో జిల్లాలోని మూడు పెద్ద మండలాలకు ఇద్దరు చొప్పున ఏపీఓలను నియమించారు. ఈసారి మూడింతలు ఎక్కువగా దాదాపు 10కిపైగా మండలాలకు ఇద్దరు చొప్పున ఏపీఓలను నియమించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీంతో అదే స్థాయులో మండలాలకు ఏపీఓ స్థానాలు ఖాళీలు పడటం గమనార్హం. ముఖ్యంగా జిల్లా కేంద్రం సమీపంలోని మండలాలకు ఇద్దరు చొప్పున ఏపీఓలను నియమించినట్లు తెలిసింది. బదిలీల సమయంలో ఎక్కడైనా ఖాళీగా ఉన్న మండలాలను భర్తీ చేయాల్సిందిపోయి అందుకు విరుద్ధంగా ఖాళీలు మరింత పెరిగేలా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలోని అన్ని మండలాలకు ఏపీఓలను నియమించిన తర్వాత అవసరమైతే పెద్ద మండలాలకు మిగిలిపోయిన లేదా ఆయా మండలాల సమీప మండలాల ఏపీఓలకు అద నపు బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందన్న అభిప్రాయాలు ఆ శాఖ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఈనెలాఖరులోగా ఉద్యోగులకు బదిలీల ఉత్తర్వులు అందించాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో అన్ని మండలాలకు ఏపీఓలను నియమించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే ఆయా మండలాల్లో ప్రజలకు సరైన సేవలు అందడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.