వర్సిటీ అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దాం
ABN , First Publish Date - 2020-11-27T06:11:49+05:30 IST
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని నూతన వీసీ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎస్కేయూ 12వ వీసీగా పరిపాలన భవనంలోని తన చాంబర్లో ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.
పరిశోధనలే కీలకం
అధ్యాపకులు రెగ్యులర్గా తరగతులకు హాజరుకావాలి
ఎస్కేయూ నూతన వీసీ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి
బాధ్యతల స్వీకరణ
ఎస్కేయూ, నవంబరు 26: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని నూతన వీసీ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎస్కేయూ 12వ వీసీగా పరిపాలన భవనంలోని తన చాంబర్లో ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్వగ్రామం వైఎ్సఆర్ జిల్లా గిడ్డంగివారిపల్లి నుంచి ఉదయం 9 గంటలకు వర్సిటీకి చేరుకున్న వీసీకి బోధన, బోధనేతర సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఫూలే, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం తన చాంబర్లో వీసీ బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం ఫూలే భవన్లో నిర్వహించిన బోధన సిబ్బంది, విభాగాధిపతులు, డీన్లు, బీఓఎస్ అధ్యక్షుల సమావేశంలో వీసీ మాట్లాడుతూ.. అధ్యాపకులు వృత్తికి న్యాయం చేయాలన్నారు. ఉద యం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విభాగంలో అందుబాటులో ఉండాలన్నారు. రెగ్యులర్గా తరగతులు బోధించాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. తాను పనిచేసిన ప్రతిచోటా సంస్కరణలకు శ్రీకారం చుట్టానన్నారు. పరీక్షల విభాగ డైరెక్టర్గా ఉన్నపుడు బార్ కోడింగ్ ప్రవేశ పెట్టానన్నారు. పరీక్షల ఫలితాలను సకాలంలో ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో రెక్టార్ కృష్ణానాయక్, ప్రిన్సిపాళ్లు శంకర్నాయక్, రామచంద్ర, సోమశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ బాలసుబ్రహ్మణ్యం, సీడీసీ డీన్ విజయకృష్ణమనాయుడు, పరీక్షల విభాగ డైరెక్టర్ చింతా సుధాకర్, రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ లక్ష్మయ్య, ప్రొఫెసర్ రాఘవులు, వెంకటనాయుడు పాల్గొన్నారు.
అభినందనల వెల్లువ
ఎస్కేయూ నూతన వీసీ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. బోధనేతర సంఘం నాయకులు పురుషోత్తంరెడ్డి, ఈశ్వరయ్య, నాగభూషణ, పెద్దన్న, టైమ్స్కేల్ నేతలు సంజీవులు, శ్రీ రాములు, నాగలింగం, చంద్రశేఖర్నాయుడు, రమేష్, మినిమమ్ స్కే ల్, హాస్టల్ సిబ్బంది, విద్యార్థి నాయకులు పులిరాజు, వేమన్న, తిరుపాలు, చెన్నయ్య, హేమంత్కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.