కుదరని సయోధ్య..!
ABN , First Publish Date - 2021-03-01T06:18:44+05:30 IST
అధికార పార్టీకి నగరంలో 12 డివిజన్లలో రెబల్స్ కొరకరాని కొయ్యలుగా మారారు.
12 డివిజన్లలో అధికార పార్టీలో రెబల్స్
దిగిరాని అసంతృప్త నేతలు
ఇంకా ఫైనల్ కాని వైసీపీ అభ్యర్థులు
నేడు బొత్స, సజ్జల రాక...
వారు వెళ్లిన తర్వాతే అభ్యర్థుల తుది జాబితా
అనంతపురం కార్పొరేషన్, ఫిబ్రవరి 28: అధికార పార్టీకి నగరంలో 12 డివిజన్లలో రెబల్స్ కొరకరాని కొయ్యలుగా మారారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మార్చి 3వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. దీంతో ఆ రోజు ఎవరు నామినేషన్లు ఉపసంహరించుకుం టారా? అనే విషయం పైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వైసీపీ, టీడీపీలు ఇంకా అభ్యర్థుల తుది జాబితాను అధి కారికంగా ప్రకటించలేదు. మొత్తం 50 డివిజన్లకు గాను టీడీపీ నుంచి 40నుంచి 45 మంది పేర్లు వినిపిస్తుండగా వైసీపీ నుంచి 30పేర్లే బలంగా వినవస్తున్నాయి. వైసీపీకి మొదటి నుంచి రెబల్స్ బెడద ఎక్కువగానే ఉంది. గత రెండురోజుల్లో కొంత మార్పు జరిగింది. రెబల్స్ విషయంలో సీరియ్సగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 12 డివిజన్లు ఆ పార్టీని చిరాకు పెడుతున్నట్టు సమాచారం. మిగిలిన డివిజన్లలో కూడా ఇంకా అసంతృప్తి రాగం వినిపిస్తున్నా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అసంతృప్తులతో మాట్లాడితే వారు సర్దుకునే అవకాశముం దని తెలుస్తోంది. ఇక ఆ పన్నెండు డివిజన్లలో మాత్రం స్థానిక నాయకులు, ఇతర డివిజన్లలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు సర్దిచెప్పే ప్రయత్నం నీరుగారినట్లు తెలుస్తోంది. సమానస్థాయి కలిగిన తమ లాంటి నాయ కులం చెబితే ఆ పంచాయితీ తెగదని...చెప్పాల్సిన వారు చెప్పక తప్పదని వారు చెబుతున్నారు. వాటిపై ఇంకా ఎమ్మెల్యే ఇంకా దృష్టి సారించలేదని సమాచారం. ఆ డివిజన్లలో రెబల్స్ బెడద కూడా ఇద్దరు, ముగ్గురు బలమై న అభ్యర్థుల నుంచే ఎదురువుతుండటమే ప్రధాన సమ స్యగా మారింది. వాటి విషయంలోనూ ఎమ్మెల్యే దృష్టి సా రిస్తే సమస్య పరిష్కారమవుతుందని ఆ పార్టీ మెజార్టీ వర్గాల వాదన. అయితే ఆ అసంతృప్తులు ఎప్పటినుంచో పార్టీకి సేవలందిస్తున్నారు. ఇప్పుడు వారితో సయోఽధ్య ఎలా కుదురుస్తారనేది ఆసక్తికరంగా మారింది. వారితో నామినేషన్లు విత్ డ్రా చేయించి రెబల్స్ బెడద లేకుండా చేసుకుంటారా...?లేక అసంతృప్తులతో ఓట్లు చీల్చుకుంటా రా...?అనేది మరో రెండురోజుల్లో తేలనుంది.
వారు వచ్చి, వెళ్లిన తరువాతే...!
అధికార వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ఇంకా వెలువడకపోవడంతో...ఎప్పుడొస్తుందా..?అనే ఆతృత ఆ పార్టీ అభ్యర్థుల్లో ఉంది. ఆదివారం సాయంత్రం లోపు తుది జాబితా వెలువడవచ్చనే ప్రచారం జరిగింది. అయితే ఆదివారం ఉదయం నుంచి అభ్యర్థుల బయోడేటా, ఫొటో లు, ఇతర వివరాలు తీసుకున్నట్టు తెలిసింది. సోమవారం జిల్లా ఇన్చార్జ్ మంత్రి బొత్ససత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నగరానికి రానున్నా రు. గుత్తిరోడ్డులోని కేటీఆర్ ఫంక్షన్హాల్లో అనంతపురం పార్లమెంటు పరిధిలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల నేత లతో వారు సమావేశం కానున్నారు. అనంతరం హిందూ పురం పార్లమెంటు పరిధిలోని మున్సిపాలిటీ నేతలతో పుట్టపర్తిలో సమావేశం నిర్వహిస్తారు. ఇక్కడ సమావేశం ముగించి వారు వెళ్లిన తరువాతే అభ్యర్థుల తుది జాబితా వెలువడవచ్చని తెలుస్తోంది.