టీడీపీ నాయకుడిపై దాడి
ABN , First Publish Date - 2021-01-24T06:04:55+05:30 IST
పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాగానే గ్రామల్లో రాజకీయం వేడెక్కింది.
- పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టార్గెట్
- సర్పంచ్ ఎన్నికల బరిలో బాధితుడి భార్య
- పది మందితో దాడి చేసిన వైసీపీ నాయకుడు
ఆదోని/ఆదోని రూరల్, జనవరి 23: పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాగానే గ్రామల్లో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తరపున పోటీ అభ్యర్థులను టార్గెట్ చేశారు. ఆదోని మండల పరిధిలోని బలాదూర్ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బోయ బజారప్పపై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పది మందితో కలిసి శనివారం రాత్రి దాడి చేశారు. ఈ దాడుల్లో బోయ బజారప్పకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు బోయ బజారప్ప తెలిపిన వివరాల మేరకు..
ఆదోని మండలం బలాదూర్ గ్రామ పంచాయతీ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బోయ బజారప్ప తన భార్యను సర్పంచ్ బరిలో నిలిపేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన రిటైర్డ్ వీఆర్వో, వైసీపీ నాయకుడు అల్లాబకాష్, ఎలాగైనా బజారప్ప భార్యను పోటీ నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పది మంది అనుచరులతో కలిసి బోయ బజారప్పపై దాడి చేశాడు. కత్తులు, రాళ్లతో దాడి చేయడంతో చంపేస్తారన్న భయంతో బజారప్ప తప్పించుకున్నాడు. తల భాగంలో తీవ్ర గాయాలపాలైన బజారప్పను స్థానికులు ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
గతంలో స్థలం వివాదం
బజారప్ప ఇంటి పక్కన ఉన్న నాలుగు సెంట్ల స్థలం కోసం ఇరు వర్గాల మధ్య వైరం ఉండేదని, కోర్టును ఆశ్రయించడంతో తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని బజారప్ప తెలిపారు. దీనికి తోడు ఎన్నికల్లో తన భార్యను నిలబెట్టకపోతే వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం అవుతారన్న ఉద్దేశంతో దాడి చేశారని బజారప్ప ఆరోపించారు. దాడి విషయం తెలుసుకున్న పార్టీ కర్నూలు లోక్సభ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి భూపాల్చౌదరి, నాయకులు బుద్ధారెడ్డి, లక్ష్మీనారాయణ, గోపాల్, వీరేష్ ఆసుపత్రికి చేరుకుని బజారప్పను పరామర్శించారు. దాడి వివరాలను తెలుసుకున్నారు. ఇస్వీ ఏఎస్ఐ రామ్నాథ్ ఆసుపత్రికి చేరుకుని బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు.