సాఫ్ట్వేర్ ఉద్యోగిపై దాడి, దోచుకున్న దుండగులు
ABN , First Publish Date - 2021-03-04T16:59:53+05:30 IST
‘‘రోడ్డు ప్రమాదం చేసి పారిపోతున్నావా’’ అంటూ దాడి చేశారు.
హైదరాబాద్/బంజారాహిల్స్ : ‘‘రోడ్డు ప్రమాదం చేసి పారిపోతున్నావా’’ అంటూ దాడి చేశారు. డబ్బు లాక్కొని పారిపోయారు. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఉదంతం వెలుగుచూసింది. సఫిల్గూడ మేఘనా హోమ్స్లో నివసించే గన్నవరం వంశీకిషోర్ గచ్చిబౌలి టి హబ్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 2న తన కారులో కార్యాలయానికి బయలు దేరాడు. పంజాగుట్ట ఫ్లై ఓవర్ ఎక్కుతుండగా అతని కారును ఓ ఆటో ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్లింది. కొద్ది దూరం వెళ్లాక ఆటో డ్రైవర్, మరో ద్విచక్ర వాహన దారుడితో గొడవ పడుతూ కనిపించాడు. ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో వంశీకిషోర్తో పాటు మిగతా ప్రయాణికులు గొడవ పడుతున్న వారిని వాహనాలు పక్కకు తీయాలని కోరారు. దీంతో గొడవ మాని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
వంశీకిషోర్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3 బస్టాప్ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆటోను అడ్డుగా పెట్టారు. కారు ఆపి కిందకు దిగిన వంశీకిషోర్తో గొడవకు దిగారు. యాక్సిడెంట్ చేసి తప్పించుకుంటూ పోతున్నావా..? అంటూ ప్రశ్నించారు. మరో ఇద్దరు ద్విచక్ర వాహనంపై అక్కడకు వచ్చి నలుగురూ వంశీ కిషోర్పై దాడి చేశారు. నష్టపరిహారం కింద యాభై వేలు ఇవ్వాలని బెదిరించారు. తాను ప్రమాదం చేయలేదని చెప్పినా వినిపించుకోలేదు. వారి నుంచి తప్పించుకునేందుకు ఎనిమిది వేలు వారికి ఇచ్చాడు. డబ్బు తీసుకున్న దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వంశీకిషోర్ తనకు జరిగిన మోసంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.