సీపీఎస్ రద్దుకు యత్నం
ABN , First Publish Date - 2022-06-26T07:52:07+05:30 IST
సీపీఎస్ రద్దుకు యత్నం
ఉద్యోగులకు అండగా ఉంటాం.. పవన్ కల్యాణ్ భరోసా
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): సీపీఎ్సను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి జనసేన పార్టీగా తన వంతు ప్రయత్నం చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. పవన్ తండ్రి కొణిదెల వెంకట్రావు జయంతి సందర్భంగా తల్లి అంజనాదేవి.. జనసేన చేపట్టిన కౌలురైతు భరోసా యాత్రకు లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ చెక్కును శనివారం పవన్కు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దు అనేది తన కుటుంబానికి భావోద్వేగంతో కూడుకున్న అంశమన్నారు. పాత పెన్షన్ విధానాన్నే తాము కోరుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ఉద్యోగులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అబ్కారీ శాఖలో విధులు నిర్వర్తించిన తన తండ్రి 2007లో కాలం చేశారని, అప్పటి నుంచి అమ్మకు పెన్షన్ రావడం మొదలైందని, పెన్షన్ డబ్బును దాచి సహాయ కార్యక్రమాలకు ఇవ్వడం అమ్మకు అలవాటుగా మారిందని చెప్పారు. లక్ష విరాళం ఇచ్చిన అంజనాదేవికి పవన్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.