వెంకన్న ఆలయంలో హుండీల చోరీకి యత్నం

ABN , First Publish Date - 2022-05-21T06:50:38+05:30 IST

పట్టణంలోని జడ్పీహెచ్‌ స్కూల్‌ (తురకబడి) సమీపం లో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీల చోరీకి యత్నం జరిగింది.

వెంకన్న ఆలయంలో హుండీల చోరీకి యత్నం
హుండీల తాళాలు పగులగొట్టి ఉన్న దృశ్యం


లెక్కింపు చేపట్టనున్న ముందురోజు రాత్రి సంఘటన

రెండు రోజులుగా పనిచేయని సీసీ కెమెరాలు

పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు

నర్సీపట్నం, మే 20 : పట్టణంలోని జడ్పీహెచ్‌ స్కూల్‌ (తురకబడి) సమీపం లో గల  వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీల చోరీకి యత్నం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటాక 2.25 గంటల ప్రాంతంలో దుండగులు ఆలయంలోకి ప్రవేశిం చి, మండపంలో ఉన్న రెండు హుండీల తాళాలను పగులగొట్టారు. ఒక హుండీని మండపం బయటకు తీసుకురాగా, ఆ సమయంలో వాచ్‌మేన్‌ కేకలు వేయడంతో ప్రహరీగోడ దూకి పరారయ్యారు. ఆలయంలో సీసీ కెమెరాలు రెండురోజులుగా పనిచేయడం లేదు. ఇదిలావుంటే, చివరిసారిగా హుండీ ఆదాయం ఈ ఏడాది జనవరిలో లెక్కించారు. ఆ తర్వాత హుండీ లెక్కించేందుకు అధికారులు చర్యలు తీసుకోలేదు. నెలరోజుల క్రితం విధుల్లో చేరిన ఇన్‌చార్జి ఈవో టి.సాంబశివరావు ఒక పర్యాయం హుండీల ఆదాయం లెక్కించేందుకు ఉన్నతాధికారులను అనుమతి కోరారు. వారు స్పందించకపోవడంతో మరోసారి అనుమతికి విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు శుక్రవారం హుండీల ఆదాయం లెక్కింపునకు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. ఇంతలోనే గురువారం అర్ధరాత్రి దాటాక ఆలయంలో హుండీల చోరీ యత్నం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు సీసీ కెమెరాలు రెండు రోజులుగా పనిచేయకపోవడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. హుండీల చోరీయత్నంపై ఈవో సాంబశివరావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌ టీమ్‌ బృందం ఆలయం పూజారిని, వాచ్‌మేన్‌ను విచారించారు. కాగా, శుక్రవారం ఉదయం ఆలయ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో రూ.1,25,214లు వేసినట్టు ఈవో తెలిపారు. 


Updated Date - 2022-05-21T06:50:38+05:30 IST