భూమి కబ్జా చేశారని పోలీసుస్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-08-14T07:40:51+05:30 IST
భైంసా రూరల్ పోలీసుస్టేషన్ ముందు కోతుల్గాం గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు.
భైంసా క్రైం, ఆగస్టు 13 : భైంసా రూరల్ పోలీసుస్టేషన్ ముందు కోతుల్గాం గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తమకు చెందిన 7 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేశాడని రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. రెండు రోజుల క్రితం ఇదే భూమి లో తాము సాగు చేసిన పత్తి పంటను చందు అనే వ్యక్తి ట్రాక్టర్తో దున్నేశాడని, దీన్ని అడ్డుకుంటే తమ కుటుంబంపై దాడి చేశాడని ఆరోపించారు. ఈ విషయమై శనివారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కనీసం తమకు న్యాయం చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. ఇక తమకు న్యాయం జరుగదని గ్రహించి పురుగుల మందు తాగాడని మల్లేష్ భార్య శైలజ తెలిపారు. కాగా ఆత్మహత్యయత్నం చేసిన మల్లేష్ను పోలీసులు, స్థాని కులు హుటాహుటిన భైంసా ఏరియా హాస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలించారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.