కాలేజీల్లో చేరి నెల కాకముందే పరీక్షలా!
ABN , First Publish Date - 2022-05-25T06:45:42+05:30 IST
ఈ నెలాఖరు నుంచి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకుల నిర్ణయంపై పోస్టు గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పీజీ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ఆందోళన
...ఇలా అయితే ఫెయిల్ అవుతామంటూ ఆవేదన
వాయిదా వేయాలని విన్నపం
విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరు నుంచి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకుల నిర్ణయంపై పోస్టు గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల రెండో తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించి...మూడు వారాల వ్యవధిలోనే పరీక్షలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కాలేజీలో చేరి నెల రోజులు కూడా కాకముందే పరీక్షలు ఎలా రాయగలమని అడుగున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ అడ్మిషన్ల ప్రక్రియను మార్చి నెల మొదటి వారంలో ప్రారంభించింది. ఈ నెల రెండో తేదీ వరకు కొనసాగించింది. ఏప్రిల్ నెలాఖరు నుంచి ఈ నెల రెండో తేదీ మధ్యే సగానికి పైగా విద్యార్థులు కాలేజీల్లో చేరారు. అయితే అడ్మిషన్లు ఆలస్యమైనా తరగతులు మాత్రం మార్చి మొదటి వారం నుంచే మొదలయ్యాయి. ఇటీవల చేరిన విద్యార్థులు...మొదటి నుంచి ఉన్న వారి నుంచి సబ్జక్టు వివరాలు అడిగి తెలుసుకునే పనిలో ఉండగానే...అధికారులు ఈ నెల 27 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ తదితర కోర్సుల చేరిన విద్యార్థులకు పరీక్షల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల అయింది. ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే...వందలాది మంది విద్యార్థులు ఫెయిలయ్యే అవకాశముందని పలు కాలేజీల అధ్యాపకులే చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో పీజీ అడ్మిషన్లు ఒకేసారి జరిగాయని, అయితే ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు మాత్రమే ముందుగా పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేయడం దారుణమని విద్యార్థులు వాపోతున్నారు. యూనివర్సిటీ అధికారులు పరిస్థితిని అర్థం చేసుకుని పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు.