కరోనాను జయించాడంటూ ఎదురేగి స్వాగతం పలికారు.. బుక్ అయ్యారు!
ABN , First Publish Date - 2020-07-07T04:55:22+05:30 IST
కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడంటూ ఓ వ్యక్తికి జనాలు పెద్ద ఎత్తున ఎదురేగి స్వాగతం పలికిన వైనమిది. ..
ఔరంగాబాద్: కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడంటూ ఓ వ్యక్తికి జనాలు పెద్ద ఎత్తున ఎదురేగి స్వాగతం పలికిన వైనమిది. కనీసం సామాజిక దూరం, మాస్క్ నిబంధనలు పాటించకుండా జరిగిన ఈ నిర్వాకంపై మహారాష్ట్ర పోలీసులు 100 మందిపై కేసు నమోదు చేశారు. ఔరంగాబాద్లోని వైజాపూర్ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ‘‘అంబేద్కర్ చౌక్ వద్ద మొదటిసారి అతడికి పెద్ద ఎత్తున ఎదురేగి స్వాగతం పలికారు. ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉన్నప్పటికీ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేసు నమోదైన వారిలో వైజాపూర్ నగర పరిషత్ మాజీ అధ్యక్షుడు కూడా ఉన్నారు..’’ అని ఇన్స్పెక్టర్ అనంత్ కులకర్ణి పేర్కొన్నారు. ఔరంగాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 6,880 మందికి కరోనా సోకినట్టు గుర్తించగా.. 310 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారి నుంచి 3,374 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3,196 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.