India vs Australia: విజృంభిస్తున్న భారత బౌలర్లు.. టపటపా రాలుతున్న వికెట్లు
ABN , First Publish Date - 2022-09-26T01:50:51+05:30 IST
సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్
హైదరాబాద్: సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా త్వరత్వరగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు అద్భుతమైన ఓపెనింగ్ లభించింది. ఓపెనర్లు కేమరన్ గ్రీన్ (52), అరోన్ ఫించ్ (7) తొలి వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో గ్రీన్ చిచ్చరపిడుగల్లే చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. 19 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు.
అయితే, భువనేశ్వర్ కుమార్ అతడిని వెనక్కి పంపిన తర్వాత కంగారూలకు క్రీజులో కుదురుకోవడం కష్టమైంది. టీమిండియా బౌలర్లు వరసపెట్టి వికెట్లు తీస్తూ బ్యాటర్ల పనిపట్టారు. ఒక దశలో 44/1గా ఉన్న ఆసీస్ స్కోరు బౌలర్ల దెబ్బకు 84/4గా మారింది. అనంతరం 115 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోగా, మరో రెండు పరుగుల తేడాతో మరో వికెట్ కోల్పోయింది. మొత్తంగా 15 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ప్రస్తుతం టిమ్ డేవిడ్ (15), డేనియల్ శామ్స్ (5) క్రీజులో ఉన్నారు.