భారత్‌కు అండగా ఉంటాం : ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మారిసన్

ABN , First Publish Date - 2021-04-24T21:08:26+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనంతో ఇబ్బందులు పడుతున్న భారత

భారత్‌కు అండగా ఉంటాం : ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మారిసన్

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనంతో ఇబ్బందులు పడుతున్న భారత దేశానికి అండగా ఉంటామని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ తెలిపారు. శనివారం ఆయన ట్విటర్ వేదికగా భారత దేశానికి సంఘీభావం ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత దేశంలోని మిత్రులకు సహాయంగా నిలుస్తామన్నారు. భారత దేశం ఎంత బలమైనదో, శక్తిమంతమైనదో, కోలుకునే సామర్థ్యంగలదో తమకు తెలుసునన్నారు. 


స్కాట్ మారిసన్ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం ఇబ్బందుల్లో ఉన్న భారత దేశంలోని మా స్నేహితులకు ఆస్ట్రేలియా అండగా ఉంటుంది. భారత దేశం ఎంత బలమైనదో, కోలుకునే సమర్థతగలదో మాకు తెలుసు. ఈ ప్రపంచ సవాలుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నేను భాగస్వాములుగా కలిసి పని చేస్తాం’’ అని పేర్కొన్నారు. 


ఇదిలావుండగా, మన దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతుండటంతో శుక్రవారం ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ కూడా స్పందించాయి. భారత దేశానికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించాయి. అదేవిధంగా చైనా కూడా సహాయపడతామని తెలిపింది. మరోవైపు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా భారత దేశానికి సంఘీభావం ప్రకటించారు. మన దేశంలో కోవిడ్-19 పరిస్థితిని గమనిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో భారత దేశం అత్యంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షునికి అత్యున్నత స్థాయి వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫాసీ అన్నారు.


Updated Date - 2021-04-24T21:08:26+05:30 IST