Srilanka లో పర్యటించడం నైతికమేనా.. ఆస్ట్రేలియా క్రికెటర్లలో మధనం
ABN , First Publish Date - 2022-05-25T22:54:39+05:30 IST
జూన్ - జులై నెలల్లో టీ20 సీరిస్, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్లు ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ టీం శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది.
సిడ్నీ : జూన్ - జులై నెలల్లో టీ20 సీరిస్, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్లు ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్(Australia cricket team) టీం శ్రీలంక(Srilanka)లో పర్యటించాల్సి ఉంది. అయితే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పర్యటించడం నైతికంగా ఎంతవరకు సబబని ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మధనపడుతున్నారు. అయితే అంతిమంగా శ్రీలంక పర్యటనకే తమ ఆటగాళ్లు కట్టుబడి ఉంటారని క్రికెట్ ఆస్ట్రేలియా(cricket australia ) సీఈవో టాడ్ గ్రీన్బెర్గ్ చెప్పారు. అక్కడి పరిస్థితుల గురించి ఆటగాళ్లందరికీ అవగాహన ఉంది. ఆహార పదార్థాల ధరల పెరుగుదల, విద్యుత్ కోతలు, ఇంధన కొరత వంటి తీవ్ర సమస్యలతో శ్రీలంక ప్రజలు కష్టాలు అనుభవిస్తున్న వేళ.. అక్కడ క్రికెట్ ఆడడంపై ఆటగాళ్లలో కొంతవరకు అసంతృప్తి ఉందని గ్రీన్బెర్గ్ చెప్పారు. ఇలాంటి అంశాలను చెప్పడం మంచిదనే ఉద్దేశ్యంతోనే చెబుతున్నానని వివరించారు. మొత్తంగా శ్రీలంక పర్యటనను కొనసాగించేందుకే ఆటగాళ్లు నిర్ణయించారని ఆయన చెప్పారు. టూర్కు సంబంధించిన ప్లానింగ్, ఏర్పాట్ల విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశాలు, సలహాలను పాటిస్తారని పేర్కొన్నారు.
1948లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శ్రీలంక అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తోంది. అత్యవసరాలైన పెట్రోల్, మెడిసిన్ కూడా దొరకడం లేదంటే అక్కడ ఎలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గత మార్చి నుంచి ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆ దేశంలో పెట్రోల్ నిల్వలు అడుగంటిపోయాయి. కార్గోషిప్లకు డాలర్లలో చెల్లించే స్థోమత లేకపోవడంతో శ్రీలంక వెలుపలే నౌకలు నిలిచిపోయాయి.