24 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా తొలి టెస్ట్.. ఫలితం డ్రా

ABN , First Publish Date - 2022-03-09T02:02:37+05:30 IST

పాకిస్థాన్‌లో 24 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ నేడు డ్రాగా ముగిసింది. పాకిస్థాన్ ..

24 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా తొలి టెస్ట్.. ఫలితం డ్రా

రావల్పిండి: పాకిస్థాన్‌లో 24 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ నేడు డ్రాగా ముగిసింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌ను 476/4 వద్ద డిక్లేర్ చేసింది. పాక్ తొలి  ఇన్నింగ్స్‌లో 157 పరుగులతో చెలరేగిన ఇమాముల్ హక్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అజేయంగా 111 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అబ్దుల్ షఫీక్ (136) టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అలాగే, అజర్ అలీ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులతో చెలరేగాడు. 


ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 459 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ఖావాజా 97 పరుగులు చేసి మూడు పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకోగా, వార్నర్ 68, లబుషేన్ 90, స్టీవ్ స్మిత్ 78 పరుగులు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ వికెట్ నష్టపోకుండా 252 పరుగులు చేసింది.


ఆస్ట్రేలియా చివరిసారి 1998లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఆ తర్వాత భద్రతా కారణాలతో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు వెనకడుగు వేసింది. మళ్లీ ఇన్నాళ్లకు కంగారూ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది. అయితే, ఫలితం తేలకుండానే ముగియడం అభిమానులను నిరాశ పరిచింది.


ఈ మ్యాచ్‌లో మొత్తం ఐదు రోజుల్లో ఇరు జట్లు కలిసి 14 వికెట్లు కోల్పోయి 1,187 పరుగులు చేశాయి. మ్యాచ్ డ్రా తథ్యం కావడంతో పాక్ తన రెండో ఇన్నింగ్స్‌ను శనివారం కరాచీలో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ప్రాక్టీస్‌గా ఉపయోగించుకుంది. 

Updated Date - 2022-03-09T02:02:37+05:30 IST