సారా వ్యాపారం మానుకోండి

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

సారా వ్యాపారం పూర్తిగా మానుకొని, ఉపాధి వృత్తుల్లో రాణించాలంటూ ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మదనపల్లె మండలంలోని గిరిజనతాండాల్లో పర్యటించారు. పరివర్తన కార్యక్రమంలో భాగంగా సదస్సులు ఏర్పాటు చేసి సారా నిషేధంపై అవగాహన కల్పించారు.

సారా వ్యాపారం మానుకోండి
సదస్సులో మాట్లాడుతున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

తయారీ, విక్రయాలు చట్టరీత్యా నేరం : ఎస్పీ 

మదనపల్లె క్రైం, జూలై 1: సారా వ్యాపారం పూర్తిగా మానుకొని, ఉపాధి వృత్తుల్లో రాణించాలంటూ ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మదనపల్లె మండలంలోని గిరిజనతాండాల్లో పర్యటించారు. పరివర్తన కార్యక్రమంలో భాగంగా సదస్సులు ఏర్పాటు చేసి సారా నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సారా కేసుల్లో చిక్కుకుంటే శిక్ష తప్పదన్నారు. తాండాల్లో యఽథా ప్రకారం సారా తయారీ, విక్రయాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై నిఘా ఉంచామన్నారు. ముఖ్యంగా పాతనేరస్థులను బైండోవర్‌ చేసుకుంటున్నట్లు చెప్పారు. పదేపదే కేసుల్లో చిక్కుకుంటే పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. మదనపల్లె డివిజన్‌లో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించి సారాపై ఉక్కుపాదం మోపాలంటూ డీఎస్పీ రవిమనోహరాచారికి సూచించారు. ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రిపూట తాండాల నుంచి పట్టణాలకు సారా తరలిస్తున్నట్లు తెలుస్తోందని, కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామంటూ స్పష్టం చేశారు. గతంలో నవోదయం పథకంతో గిరిజనులు అన్ని విధాల లబ్ధి పొందారని, సారా తయారీ, వ్యాపారం జోలికెళ్లకుండా ప్రభుత్వం సబ్సిడీ రుణాలను మంజూరు చేసిందన్నారు. అయితే కొద్ది రోజులుగా మళ్లీ సారాపై మొగ్గు చూపారని వివరించారు. అనంతరం నారమాకులతాండాలో ఉన్న రెండువేల లీటర్ల ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజ్‌కమల్‌, డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐలు సత్యనారాయణ, మురళీకృష్ణ, ఎస్‌ఐ చంద్రశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST