కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2021-04-24T05:06:02+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ను కట్టడి చేయాలంటే ప్రజలంతా ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కేఆర్.పురం ఐటీడీఏ పీవో ఆర్వి.సూర్యనారాయణ, జిల్లా ఉప వైద్యాధికారి సీహెచ్.మురళికృష్ణ పిలుపునిచ్చారు.
బుట్టాయగూడెం, ఏప్రిల్ 23: కరోనా సెకండ్ వేవ్ను కట్టడి చేయాలంటే ప్రజలంతా ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కేఆర్.పురం ఐటీడీఏ పీవో ఆర్వి.సూర్యనారాయణ, జిల్లా ఉప వైద్యాధికారి సీహెచ్.మురళికృష్ణ పిలుపునిచ్చారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఈవోపీఆర్ డీలు, సిఐలు, కార్యదర్శులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్కు ప్రజలు పూర్తి సహకారం అందించాలన్నారు. బుట్టాయగూడెం సెంటర్లో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మైక్ చేతబట్టి కరోనా నియంత్రణ జాగ్రత్తలు వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, తరుచు శానిటైజర్తో చేతులు శుభ్రం చేసు కోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు.
జాగ్రత్తలు పాటించండి
జంగారెడ్డిగూడెం : కరోనా నియంత్రణలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రవికిరణ్ అన్నారు. పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమంలో ఆయన పలు సూచనలు ఇచ్చారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో పోలీసులు అహర్నిశలు పనిచేస్తున్నారని, వ్యక్తి గత జాగ్రత్తలు కూడా పాటించాలన్నారు. ప్రజలకు ముందుండి సేవ చేసే వ్యవస్థలలో పోలీసు వ్యవస్థ ఒకటని, కంటికి కనిపించని మహమ్మారి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ గౌరీశంకర్, ఎస్ఐ ఆనందరెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు, సిబ్బంది పాల్గొన్నారు.
భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి..
ద్వారకాతిరుమల: వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని దేవస్థానం వైద్యాధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. భక్తులు ఆలయంలో తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఆరడుగుల భౌతికదూరం పాటించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పదేళ్ల లోపు పిల్లలు, ఆలయ ప్రాంగణంలోకి రాకూడదని, భక్తులు గమనించాలని తెలిపారు.