జాతీయ దేవాలయంగా అయోధ్య రామాలయం : యోగి

ABN , First Publish Date - 2022-02-18T22:40:27+05:30 IST

అయోధ్యలో రామాలయం 2023నాటికి పూర్తవుతుందని

జాతీయ దేవాలయంగా అయోధ్య రామాలయం : యోగి

లక్నో : అయోధ్యలో రామాలయం 2023నాటికి పూర్తవుతుందని, ఇది భారత దేశ జాతీయ దేవాలయం అవుతుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. 


సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా పేరు పొందిన మయిన్‌పురిలో కర్హాల్ నియోజకవర్గం ఉంది. మయిన్‌పురిలోని అన్ని (4) శాసన సభ నియోజకవర్గాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్హాల్ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ ఓడిపోతుందని, ఆ విషయాన్ని ఆ పార్టీ నేతలు ముందుగానే గ్రహించారని చెప్పారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ఎస్‌పీ సింగ్ బాఘెల్‌పై దాడి చేయడం పిరికిపంద చర్య అని మండిపడ్డారు. 


అయోధ్యలో దివ్యమైన రామాలయం నిర్మాణం 2023నాటికి పూర్తవుతుందని, ఇది భారత దేశ జాతీయ మందిరం అవుతుందని చెప్పారు. రాజకీయ నేతల దురహంకారాన్ని మార్చి 10 (ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) తర్వాత అంతం చేస్తానన్నారు. నాలుగేళ్ళ నుంచి దాక్కుని, ఎన్నికల సమయంలో బయటకు వచ్చిన నేతల కోసం బుల్డోజర్లను వాడతామని చెప్పారు. 


Updated Date - 2022-02-18T22:40:27+05:30 IST