జగన్ బుద్ధి ఇంకా మారలేదు: అయ్యన్నపాత్రుడు
ABN , First Publish Date - 2021-03-25T21:52:11+05:30 IST
వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ట్విట్టర్లో మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ట్విట్టర్లో మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. పదోతరగతి పరీక్ష పేపర్లు ఎత్తుకెళ్లిపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బుద్ధి ఇంకా మార్చుకోలేదని ఎద్దేవా చేశారు.ఇచ్చిన ప్రతీ మాట, వేసిన ప్రతీ అడుగు తప్పుడుతో ఇప్పటికే ఫేక్ సీఎం అనిపించుకున్నాడని అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు. అమరావతి రైతుల పేరుతో సీఐడీకి ఫేక్ ఫిర్యాదులు ఇచ్చి ఫేక్ సీఎం బిరుదు సార్థకం చేసుకున్నాడన్నారు. అమరావతి అసైన్డ్ భూములపై దర్యాప్తు చేస్తున్న పోలీసులైనా నిజమైనోళ్లా? లేక ఫేక్ సీఎం ఇచ్చిన ఫేక్ ఫిర్యాదులాంటి ఫేక్ ఖాకీలా? అని అయ్యన్నపాత్రుడు నిలదీశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అంగీకరించి, పాలకపక్షంలోకొచ్చాక కక్ష కట్టి మరీ అమరావతి అంతానికి కుట్రలు చేస్తున్నావని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికేంద్రీకరణ పేరుతో అమరావతిపై నువ్వు చిమ్ముతున్న విద్వేషపు విషాన్ని... టీడీపీ జనం ముందు ఉంచిందని స్పష్టం చేశారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎంత బెదిరించినా జగన్ అండ్ గ్యాంగ్ చెప్పేవన్నీ అబద్ధాలు అని జనం కుండబద్దలు కొట్టారన్నారు. అసత్యప్రచారాలే పునాదులు నిర్మించుకున్న అధికారం కూలిపోయే రోజు దగ్గర పడింది జగన్రెడ్డి అని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.