AP News: అప్పులు, అభివృద్ధిపై చర్చకు సిద్ధం: అయ్యన్న
ABN , First Publish Date - 2022-07-28T01:22:33+05:30 IST
ఐదేళ్ల కాలంలో టీడీపీ చేసిన అప్పులు, రాష్ట్ర అభివృద్ధి.. మూడున్నరేళ్ల కాలంలో ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులు
విజయనగరం: ఐదేళ్ల కాలంలో టీడీపీ చేసిన అప్పులు, రాష్ట్ర అభివృద్ధి.. మూడున్నరేళ్ల కాలంలో ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులు, అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ (jagan) పాలన తుగ్లక్ని తలపిస్తోందన్నారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, రోడ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ (Telangana) నుంచి ఆంధ్రప్రదేశ్లో కలిసిన ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హుద్హుద్, తితలీ లాంటి భీకర తుఫాన్లు వచ్చాయని, అటువంటి సమయంలోనూ చంద్రబాబు (Chandrababu) నిరంతరం శ్రమించి తొందరగా ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించారని అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు.