బాబు రాముడు.. జగన్ రాక్షసుడు
ABN , First Publish Date - 2022-05-29T08:14:02+05:30 IST
బాబు రాముడు.. జగన్ రాక్షసుడు
ఆయన పాలనలో నిర్మాణం.. ఈయన పాలనలో విధ్వంసం
కియా, హోండా, పరిశ్రమలకు బాబు బ్రాండ్ అంబాసిడర్
కోడికత్తి, బాబాయి హత్య, అమరావతిపై మోసానికి జగన్
అది యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ: లోకేశ్
అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు రాముడు.. రాముడుంటే రాక్షసుడూ ఉంటాడు.. జగన్రెడ్డి రాక్షసుడు. రాముడి పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో నంబర్వన్.. రాక్షసుడి పాలనలో బాదుడే బాదుడులో నంబర్వన్. రాముడి పాలనలో నిర్మాణం జరిగింది. రాక్షసుడి పాలనలో విధ్వంసం జరుగుతోంది. రాముడి పాలనలో పరిశ్రమలు, ఉద్యోగాల్లో నంబర్వన్. రాక్షసుడి పాలనలో రౌడీయిజం, కేసుల్లో నంబర్వన్’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వ్యాఖ్యానించారు. తిరుగుబాటు మొదలైందని.. అణచివేత అఽధికమయ్యేకొద్దీ తీవ్రమవుతుందని హెచ్చరించారు. శనివారం ఒంగోలులో జరిగిన మహానాడు బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత కొద్ది రోజులుగా మహానాడు పనులను పర్యవేక్షిస్తూ.. అందరితో మాట్లాడుతూ ఉన్న కారణంగా ఆయన గొంతు బొంగురుపోయింది. అయినా సరే అలాగే మాట్లాడారు. తండ్రి శవాన్ని పక్కనపెట్టుకుని ముఖ్యమంత్రి పదవికోసం రాజకీయం చేసిన మనిషి జగన్రెడ్డి అని లోకేశ్ మండిపడ్డారు. యువత, వృద్ధులు, మహిళలు, అవ్వా, తాత అందరినీ ఒక్క చాన్స్ అంటూ బతిమాలుకుని అధికారంలోకి వచ్చాడని.. వచ్చాక అందరినీ మోసం చేశాడని. అందుకే తిరుగుబాటు మొదలైందని చెప్పారు. ‘చంద్రబాబు కియా, హోండా, అశోక్ లేలాండ్ లాంటి పరిశ్రమలకు బ్రాండ్ అంబాసిడర్. వందల పరిశ్రమలు తెచ్చి లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. కానీ జగన్ కోడికత్తి, బాబాయి హత్య, రాజధాని అమరావతికి మోసాలకు బ్రాండ్ అంబాసిడర్. సొంత చెల్లి, తల్లి, రైతులు, యువత, కార్మికులు, ఉద్యోగులందరికీ వెన్నుపోటు పొడిచాడు. ప్రజావేదికతో మొదలైన అతడి విధ్వంసం కొనసాగుతూనే ఉంది. మహిళలకు ఆపద వస్తే బుల్లెట్లా వస్తానన్నాడు. ఇప్పుడు రోజుకో మహిళపై అఘాయిత్యం, అత్యాచారం జరుగుతుంటే ఎక్కడున్నాడు? అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మళ్లీ కుల చిచ్చు పెడుతున్నాడు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అతడు చేసే ఈ చెత్త పనులను, కుళ్లు రాజకీయాలను ఛీకొట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారు’ అని తెలిపారు.
కోస్తే పసుపు రక్తమే!
‘మా పార్టీ కార్యకర్తలు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించేది పసుపు జెండా. కోస్తే పసుపు రక్తమే’ అని లోకేశ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి నాలుగు దశాబ్దాలైందని.. ఈ నాలుగు దశాబ్దాల్లో ఈ రోజు చరిత్రలో నిలబడబోతుందని చెప్పారు. ‘లక్షలాది మంది తరలివచ్చారు. అయ్యా.. జగన్! నువ్వు బస్సులు ఆపగలుగుతావు. మా కారు టైర్లలో గాలి తీయగలుగుతావు. కానీ టీడీపీ కార్యకర్తలను మాత్రం ఆపలేవు. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని ఏ శుభముహూర్తాన స్థాపించారో.. మా పునాదులు గట్టిగా ఉన్నాయి. చాలామంది తెలుగుదేశాన్ని భూస్థాపితం చేస్తామన్నారు. వారిలో కొందరు గాల్లో కలిసిపోయారు. ఇంకొందరు వారే భూస్థాపితమయ్యారు. అంజిరెడ్డి తాత! వయసు 82. కానీ మీసాలు తిప్పి తొడగొట్టి రారా బిడ్డా.. రా తేల్చుకుందామని జగన్కు సవాల్ విసిరారు. అంతేకాదు.. చంద్రయ్య అనే ఇంకో నాయకుడు. వైసీపీ మూక లు చంపేసేముందు కూడా జై జగన్రెడ్డి అనమంటే.. చంపండి.. జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు. టీడీపీ కార్యకర్తల ఆత్మబలం అది. వైసీపీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అరాచకాలను మూడేళ్లు భరించిన ప్రజలు.. ఇక మావల్ల కాదంటూ గడపగడపకు కార్యక్రమంలో నిలదీస్తున్నారు’ అని లోకేశ్ తెలిపారు.