అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ మైదానాలు
ABN , First Publish Date - 2022-05-25T05:25:47+05:30 IST
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ మైదానాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకనాథ్ తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకనాధ్
నెల్లూరు (విద్య) మే 24 : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ మైదానాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకనాథ్ తెలిపారు. ఆయన రాష్ట్ర బ్యాడ్మింటన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మంగళవారం సాయంత్రం జిల్లాలోని క్రీడా సంఘాలు, క్రీడాభిమానులు చేసిన ఆత్మీయ సన్మానంలో ఆయన మాట్లాడారు. ఏపీలో షటిల్ బ్యాడ్మింటన్ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. అంతర్జాతీయ, జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేసి దేశం గర్వించే రీతిలో విజయాలు సొంతం చేసుకునేలా సిద్ధం చేస్తామని తెలిపారు. నూతనంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. దశాబ్దం క్రితం నెల్లూరులో జరిగిన జూనియర్ జాతీయ పోటీల్లో పాల్గొన్న పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ కశ్యప్ తదితర క్రీడాకారులతో పాటు ఎంతో మంది నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఆనందంగా ఉందన్నారు. ఇదే లక్ష్యంతో జిల్లా నుంచి కూడా అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తామన్నారు. ఈ సందర్బంగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధు ఫోన్ చేసి ద్వారకనాథ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం క్రీడా సంఘాల వారు, క్రీడా ప్రముఖులు, సీనియర్ క్రీడాకారులు, కోచ్లు ద్వారకనాఽథ్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రంజీ క్రికెట్ మాజీ క్రీడాకారులు మలిరెడ్డి కోటారెడ్డి, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్యచౌదరి, కోశాధికారి సురేష్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాద్రావు, సెట్నల్ సీఈవో పుల్లయ్య, డీఎస్ఏ చీఫ్ కోచ్ ఆర్కె.యతిరాజ్, సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.