ఆ దేశాల వారికి వర్క్ పర్మిట్లను నిలిపివేసిన బహ్రెయిన్!
ABN , First Publish Date - 2021-06-15T14:31:50+05:30 IST
విదేశీయులకు జారీ చేసే వర్క్ పర్మిట్ల విషయమై తాజాగా బహ్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో బ్యాన్ విధించిన రెడ్ లిస్ట్ దేశాల వారికి తాత్కాలికంగా వర్క్ పర్మిట్లను నిలిపివేస్తున్నట్లు బహ్రెయిన్ ప్రకటించింది.
మనామా: విదేశీయులకు జారీ చేసే వర్క్ పర్మిట్ల విషయమై తాజాగా బహ్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో బ్యాన్ విధించిన రెడ్ లిస్ట్ దేశాల వారికి తాత్కాలికంగా వర్క్ పర్మిట్లను నిలిపివేస్తున్నట్లు బహ్రెయిన్ ప్రకటించింది. కరోనాపై పోరు కోసం ఏర్పడ్డ నేషనల్ టాస్క్ఫోర్స్ సూచన మేరకు ఆ దేశ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, బహ్రెయిన్ రెడ్ లిస్ట్లో భారత్ సహా పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఉన్నాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం బహ్రెయిన్ బయట ఉన్నా రెడ్ లిస్ట్ దేశాల పౌరులకు కొత్త వర్క్ పర్మిట్ల జారీ నిలిచిపోనుంది. అయితే, బహ్రెయిన్లో ఉన్నవారికి ఈ నిబంధన వర్తించదని అథారిటీ అధికారులు వెల్లడించారు. ఇక వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల వారి రాకపై మే 24 నుంచి బహ్రెయిన్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి భారత్తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ను రెడ్ లిస్ట్లో చేర్చుతూ బహ్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలాఉంటే.. బహ్రెయిన్లోనూ తన ఉనికిని చాటుకున్న మహమ్మారి ఇప్పటివరకు 2,57,852 మందికి సోకగా, 1,206 మందిని బలి తీసుకుంది.