బడిబాటపై ఏమరుపాటు..
ABN , First Publish Date - 2022-06-25T05:57:44+05:30 IST
ఖమ్మం జిల్లాలో బడిబాట కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 19 పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలపై విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈనెల 13నుంచి విద్యాశాఖ బడిబాట కార్యక్రమం చేపట్టి అన్ని పాఠశాలల్లో ఇప్పటికే నమోదు అయిన విద్యార్థులు నూరుశాతం పాఠశాలకు హాజరయ్యే
19పాఠశాలలకు శ్రీముఖాలు
మధిర, జూన 24: ఖమ్మం జిల్లాలో బడిబాట కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 19 పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలపై విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈనెల 13నుంచి విద్యాశాఖ బడిబాట కార్యక్రమం చేపట్టి అన్ని పాఠశాలల్లో ఇప్పటికే నమోదు అయిన విద్యార్థులు నూరుశాతం పాఠశాలకు హాజరయ్యేలా రోజుకొక కార్యక్రమం చేపట్టాలని ఆదేశించింది. విద్యార్థులు హాజరుశాతం పెరిగేలా చూడటం ఉపాధ్యాయుల విధిగా పేర్కొంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 23వరకు జిల్లాలో పాఠశాలల వారీగా హాజరు వివరాలు పరిశీలించిన కలెక్టర్ జిల్లాలో కనీసం 50శాతం హాజరు లేని 19పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖ గురువారం సాయంత్రమే జిల్లాలోని 19పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆయా పాఠశాలలకు శుక్రవారం నోటీసులు అందాయి. ఇవి అందుకున్న మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకుంటే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ నోటీసులు ఉపాధ్యాయుల్లో కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఎర్రుపాలెం మండలంలో అత్యధికంగా ఆరు పాఠశాలలు, బోనకల్ మండలంలో 1, ముదిగొండ మండలంలో 1, తల్లాడ మండలంలో 3, కూసుమంచి మండలంలో 2, కల్లూరు మండలంలో 1, సింగరేణి మండలంలో 2, పెనుబల్లి మండలంలో 1, రఘునాధపాలెం మండలంలో 1, కామేపల్లి మండలంలో 1 పాఠశాలకు షోకాజ్ నోటీసులు జిల్లా విద్యాశాఖ జారీ చేసింది.