ఉన్నతాధికారుల స్వార్థానికి బలయ్యా..

ABN , First Publish Date - 2020-09-08T21:32:51+05:30 IST

అధికార దాహానికి బలై కొన్న రోజులుగా వైద్య వృత్తికి దూరమైనట్లు దావణగెరెలో ఆటో డ్రైవరుగా మారిన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎంహెచ్ రవీంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు...

ఉన్నతాధికారుల స్వార్థానికి బలయ్యా..

బెంగుళూర్ (కర్ణాటక): ఆరోగ్య శాఖలో జిల్లా స్థాయి వైద్యాధికారిగా పనిచేసిన తాను ఉన్నతాధికారుల స్వార్థానికి, అధికార దాహానికి బలై కొన్న రోజులుగా వైద్య వృత్తికి దూరమైనట్లు దావణగెరెలో ఆటో డ్రైవరుగా మారిన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎంహెచ్ రవీంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దావణగెరెలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. బళ్లారి జిల్లాలో జిల్లాస్థాయిలో వైద్యాధికారిగా ఉన్న తనను 2017-19లో అప్పటి జడ్పీ సీఈవో ఆయన స్నేహితున్ని ఆర్‌సీహెచ్ వైద్యునిగా నియమించాలని సూచించగా దానిని తాను నిరాకరించడంతో అప్పటి నుంచి తనను ఉన్నతాధికారులు వేధించడం ప్రారంభించారని ఆరోపించారు.


వేధింపులు తట్టుకులేకే ఆటో డ్రైవరునయ్యా..

తనపై అవినీతి ఆరోపణలు చేసి సస్పెండ్ చేశారని, కొన్నాళ్లకు తాలూకా వైద్యాధికారిగా తనను బదిలీ చేసి వేధించారని వాపోయారు. ప్రభుత్వ పాలన వ్యవస్థలో లోపాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఏ పనైనా చేసి జీవనం సాగించవచ్చని చాటేందుకు 4 రోజుల నుంచి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నానని డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు. మళ్లీ పోస్టింగ్ రాకపోతే చివరి వరకు ఆటో డ్రైవరుగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన దుస్థితికి కారకులైన అధికారులకు తగిన శిక్ష విధించాలని డాక్టర్ రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-08T21:32:51+05:30 IST