నిబంధనలకు విరుద్ధంగా బల్లకట్టు రవాణా
ABN , First Publish Date - 2021-04-17T06:02:41+05:30 IST
ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న బల్లకట్టును పోలీసు అధికారులు శుక్రవారం నిలిపివేశారు. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలు నీరు నిలపటంతో కొన్ని నెలలుగా బల్లకట్టు తిరగలేదు.
నడిపేందుకు సిద్ధమైన అధికార పార్టీ నాయకులు
అడ్డుకున్న అధికారులు
మాచవరం, ఏప్రిల్ 16: ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న బల్లకట్టును పోలీసు అధికారులు శుక్రవారం నిలిపివేశారు. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలు నీరు నిలపటంతో కొన్ని నెలలుగా బల్లకట్టు తిరగలేదు. కొన్నిరోజుల నుంచి పులిచింతల బ్యాక్వాటర్ తగ్గిపోవటంతో బల్లకట్టును నడిపేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న స్పెషల్బ్రాంచ్, మాచవరం పోలీసులు అనుమతులు లేకుండా తిప్పరాదంటూ నిలిపివేశారు. అయితే తెలంగాణా వైపు సుమారు రూ.45 లక్షలకు నరసింహారావు అనే వ్యక్తి వేలం దక్కించుకుని అటు నుంచి ఆంధ్రా వైపు ప్రయాణికులను చేరవేస్తున్నారు. ఇది అదునుగా తీసుకున్న మాచవరం మండల వైసీపీ నాయకులు ఇటువైపు నుంచి కూడా అదే బల్లకట్టులో ప్రయాణికులను, వాహనాలను తరలించేందుకు రెడీ అయ్యారు. ఇది తెలుసుకున్న పోలీసులు అనుమతులు లేకుండా ప్రయాణికులను, వాహనాలను దాటించవద్దంటూ బల్లకట్టు నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మాచవరం ఎస్ఐ రాజానాయక్ మాట్లాడుతూ తెలంగాణా బల్లకట్టు నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చేందుకు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.