కమీషన్‌ తీసుకుని కానిచ్చేద్దాం..!

ABN , First Publish Date - 2022-06-05T17:06:52+05:30 IST

బళ్లారి సిటీ కార్పొరేషన్‌లో జరిగే అభివృద్ధి పనులు ఎవరికి వాళ్లు చేయకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చేసి కమీషన్‌ తీసుకుందామని కొందరు

కమీషన్‌ తీసుకుని కానిచ్చేద్దాం..!

- అభివృద్ధి పనులపై కొందరు కార్పొరేటర్ల నిర్ణయం 

- బళ్లారి సిటీ కార్పొరేషన్‌లో రాత్రి పొద్దుపోయేదాకా చర్చలు


బళ్లారి(బెంగళూరు), జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): బళ్లారి సిటీ కార్పొరేషన్‌లో జరిగే అభివృద్ధి పనులు ఎవరికి వాళ్లు చేయకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చేసి కమీషన్‌ తీసుకుందామని కొందరు కార్పొరేటర్లు తీర్మానించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. శనివారం రాత్రి దాదాపు 13 మంది కార్పొరేటర్లు పాలికెలో సమావేశమయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు, బీజేపీ నుంచి గెలిచిన మరి కొందరు కార్పొరేటర్లు కలిసి సమావేశమయ్యారని తెలిసింది. బళ్లారి నగర పాలికెలో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి కోట్లలో నిధులు వస్తాయి. డీఎంఎఫ్‌, హైదరాబాద్‌ కర్ణాటక ప్రత్యేక నిధి, నగర పాలికె సంస్థ నుంచి ఏటా కోట్లల్లో నిధులు విడుదలవుతున్నాయి. వీటితో వార్డుల్లో ప్రజల కోసం వివిధ అభివృద్ధి పనులు చేయాలి. ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులు చేయాలంటే సంబంధిత వార్డు కార్పొరేటర్‌ అనుమతి తప్పని సరిగా ఉండాలి. వార్డుల్లో పనులను మొత్తం మీద కలిసి కాంట్రాక్టర్లుకు అప్పగించి గుడ్‌విల్‌ రూపంలో కమీషన్‌ తీసుకునేందుకు తొలుత చర్చించారు. అలాకాకుండా మరో పద్దతి గతంలో ఉండేది. బళ్లారి నగర పాలికెలో కార్పొరేటర్లకు నెలకు రూ. 30 వేలు ఇస్తే వాళ్ల వార్డులో జరిగే పనులకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకూడదు. ఇలా పాత పద్ధతి పాటించాలా..? లేదా నెలనెలా రూ. 50 వేలు  కార్పొరేటర్లకు ఇస్తే బాగుంటుందనే చర్చకూడా జరిగిందని సమాచారం. ఇలా అనేక రకాలుగా నగర పాలికెలో జరిగే పనులకు సంబంధించిన కమీషన్‌ వి షయంలో శనివారం రాత్రి బాగా పొద్దుపోయే దాకా కార్పొరేటర్లు నగర పాలికె కార్యాలయంలో చర్చించారు. ఈ సమావేశానికి కొందరు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు హజరు కాలేదు. ఈ కమిషన్‌ విషయంలో మేయర్‌ భర్త సుబ్బరాయుడు వ్యతిరేకించారని సమాచారం. కొందరు కార్పొరేటర్లు మాత్రం తాము గెలిచేందుకు రూ. కోట్లల్లో ఖర్చు చేసుకున్నామని, కనీసం పనుల్లో గుడ్‌ విల్‌ అయినా రాకుంటే ఎలా అని ప్రశ్నించారని తెలిసింది. 

Updated Date - 2022-06-05T17:06:52+05:30 IST