Bandi Sanjay: కృష్ణంరాజు మంచి మిత్రులు.. ఎక్కడున్నా నాతో మిత్రుత్వాన్ని వదులుకోలేదు..
ABN , First Publish Date - 2022-09-11T16:17:10+05:30 IST
కృష్ణంరాజు మరణ వార్త తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్: సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత కృష్ణంరాజు (Krishnam Raju) మరణ వార్త తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆదివారం ప్రెస్ నోటు విడుదల చేశారు. కృష్ణంరాజు తనకు మంచి మిత్రులని, ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా.. తనతో మిత్రుత్వాన్ని వదులుకోలేదన్నారు. వాజ్పేయి (Vajpayee)ని ప్రధానమంత్రిగా చేయాలన్న ఉద్దేశంతో కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీలో చేరి లోక్ సభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారన్నారు. వాజ్పేయి ప్రభుత్వంలో వివిధ శాఖలలో పనిచేసి ప్రజలకు సేవలందించారని కొనియాడారు.
తెలంగాణ విమోచన దినోత్సవం (17 సెప్టెంబర్) సందర్భంగా నిజాం కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కృష్ణంరాజు ప్రజలను ఉత్సాహపరిచారని బండి సంజయ్ అన్నారు. అనేక చిత్రాలలో నటించి తెలుగు ప్రజలను సినిమా ద్వారా చైతన్య పరిచిన వ్యక్తి అన్నారు. వారి మరణం బీజేపీ పార్టీకి, తెలుగు ప్రజలకు, సినిమా కళాకారులకు తీరని లోటన్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు బండి సంజయ్ తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు.