Bandi Sanjay: బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ భయపడుతున్నారు...
ABN , First Publish Date - 2022-08-28T20:58:04+05:30 IST
బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్ (Hyderabad): బీజేపీ (BJP)కి వస్తున్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్ (CM KCR) భయపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, యువత ఆదివారం బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగుతోందని, టీఆర్ఎస్ పాలనలో డబ్బులు ఇవ్వనిదే ఏ పని కావడం లేదని విమర్శించారు. ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై ఛీత్కారానికి కేసీఆరే కారణమని ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వంలో దేశం ముందుకెళ్తోందని బండి సంజయ్ అన్నారు. ప్రపంచం మొత్తం భారత్ (India)ను చూసి గర్విస్తుంటే...సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (Minister KTR)లు మాత్రం చైనా (China)ను పొగుడుతున్నారని విమర్శించారు. ఏ స్కాంలోనైనా కేసీఆర్ కుటుంబ సభ్యులుంటారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.