ప్రగతి భవనాన్ని కూల్చి అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తా: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-07-30T19:18:43+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ప్రగతి భవనాన్ని కూల్చి అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తా: బండి సంజయ్

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ప్రగతి భవనాన్ని కూల్చి 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 2023 తర్వాత లక్ష నాగళ్ళతో దున్ని కేసీఆర్ ఫామ్ హౌస్‌ను బడుగులకు పంచుతామన్నారు. కేసీఆర్ మెడలు వంచి బడుగులకు ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామన్నారు. హుజురాబాద్‌లో జరుగుతుంది బైపోల్స్ కాదని, కేసీఆర్‌కు బైయింగ్ ఎలక్షన్స్ అని అన్నారు.


ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు కాదని, రూ. 50 లక్షలు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలుపును సీఎం కేసీఆర్ అడ్డుకోలేరన్నారు. కేసీఆర్‌పై తెలంగాణ సమాజం విశ్వాసం కోల్పోయిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధిపై సీఎంకు చితశుద్ది లేదని విమర్శించారు. పోడు భూముల్లో చేతికొచ్చిన పంటను నాశనం చేయిస్తున్నారని, ఫారెస్ట్ అధికారులను పంపి పోడు రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈటల బావమరిది చాటింగ్‌పై విచారణ జరిపించాలని సవాల్ చేశారు. నిజంగా ఆయన తప్పు చేస్తే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బడుగులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలకు బీజేపీ సిద్ధమవుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-07-30T19:18:43+05:30 IST