కేసీఆర్ సర్కార్ను ఎండగట్టాలి: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-05-28T08:33:26+05:30 IST
హైదరాబాద్, మే 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నా.. ఏమీ ఇవ్వడం లేదని బదనాం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వ తీరును
హైదరాబాద్, మే 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నా.. ఏమీ ఇవ్వడం లేదని బదనాం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధుల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఏ ఆశయాలు, ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో.. వాటికి భిన్నంగా కేసీఆర్ కుటుంబం పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనంతరం బీజేపీ చేరిన పలువురు సీనియర్ నేతలతో బండి సంజయ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులతో సభను నిర్వహిస్తామని చెప్పారు. కేసీఆర్ పాలనలో నిజమైన ఉద్యమకారులు, అమరుల కుటుంబాలతోపాటు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు.
పార్టీ అధికార ప్రతినిధులపై సంజయ్ అసంతృప్తి
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల పనితీరు సరిగా లేదంటూ బండి సంజయ్ తీవ్ర అసంతృప్తి చేశారు. 9 మంది అధికార ప్రతినిధులు ఉన్నప్పటికీ పార్టీ కోసం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని వారితో సమావేశమైన సందర్భంగా వ్యాఖ్యానించారు. బీజేపీపై టీఆర్ఎస్ నేతలు చేస్తున విమర్శల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సరైన సమయంలో.. సరైన విధంగా స్పందించాలని సూచించారు. ప్రతి రోజూ ఒక అధికార ప్రతినిధి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.