రేపే బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర
ABN , First Publish Date - 2022-04-13T21:35:32+05:30 IST
ప్రజా సంగ్రామయాత్రకు పాలమూరు కమలదళం సిద్ధమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో చేపడుతోన్న
హైదరాబాద్: ప్రజా సంగ్రామయాత్రకు పాలమూరు కమలదళం సిద్ధమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో చేపడుతోన్న రెండోదశ యాత్ర ఈ నెల 14న అలంపూర్ నుంచి ప్రారంభంకానుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున జోగుళాంబదేవి ఆలయం బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేసి అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రను బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ప్రారంభిస్తారు. 31 రోజుల పాటు సాగే ఈ యాత్ర మే 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ముగుస్తుంది.
పాదయాత్రలో ప్రతీరోజూ ఉదయం 7:30 నుంచి 8గంటలలోపు మొదలయ్యే పాదయాత్ర 11 గంటలకు ముగుస్తుంది. పాదయాత్ర సందర్భంగా మార్గమధ్యంలో వచ్చే గ్రామాలు, బస్తీల్లో ప్రజలతో బండి సంజయ్, ఇతర నేతలు సమావేశాలు, రచ్చబండ సమావేశాలు నిర్వహిస్తారు. వివిధ వర్గాల ప్రజలతో మమేకమై వారి సాధక బాధకాలు తెలుసుకొంటారు. అదేవిధంగా రాత్రి బసచేసే వద్ద ప్రజలతో సమావేశాలు జరుపుతారు.
50 మంది మొదలుకొని 500 మంది వరకు ప్రజలతో ఈ సమావేశాలుంటాయి. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బహిరంగసభ నిర్వహించాలని భావిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కీలకనేతలు డీకే అరుణ, జితేందర్రెడ్డితో పాటు శాంతకుమార్, బంగారు శ్రుతి, ఆచారి తదితర నేతలతో ఇప్పటికే అధిష్టానం చర్చలు జరిపి రూట్ మ్యాప్ ఖరారు చేసింది.