ఉక్కు సంకల్పంతో బంద్‌

ABN , First Publish Date - 2021-03-06T06:17:33+05:30 IST

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ట్రేడ్‌ యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లావ్యాప్తంగా బంద్‌ జరిగింది.

ఉక్కు సంకల్పంతో బంద్‌
గుంటూరు శంకర్‌విలాస్‌ సెంటర్‌లో ధర్నా చేస్తున్న వివిధ పార్టీల, సంఘాల నాయకులు

జిల్లాలో రాష్ట్ర బంద్‌ ప్రశాంతం

స్వచ్ఛందంగా వ్యాపార సంస్థల మూత

పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, ప్రదర్శనలు


ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉక్కు సంకల్పంతో జిల్లాలో శుక్రవారం బంద్‌ జరిగింది. రాష్ట్ర బంద్‌లో భాగంగా ముందస్తుగానే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విశాఖ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పక్షాలతో పాటు, విద్యార్థి సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు బంద్‌లో పాల్గొన్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దుకాణా లను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు. మానవహారా లు, ప్రదర్శనలు, రాస్తారోకోలతో బంద్‌ జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌ కు సహకరిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆందోళనకారులను అరెస్టు చేయడంపై వివిధ పక్షాల నాయకులు మండిపడ్డారు. 


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ట్రేడ్‌ యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లావ్యాప్తంగా బంద్‌ జరిగింది. శుక్రవారం జిల్లాలో బంద్‌ విజయవంతంగా జరిగింది. విద్యాసంస్థలకు ముందుగానే సెలవులు ప్రకటించడంతో మూతపడ్డాయి. అన్నిరకాల వ్యాపార సంస్థలు బంద్‌లో పాల్గొనడంతో వ్యాపార కలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం కూడా బంద్‌కు మద్దతు పలకడంతో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు నిలిచిపోయాయి. గుం టూరులోని ఆర్టీసీ బస్టాండ్‌, శంకర్‌ విలాస్‌ సెంటర్లలో వివిధ పక్షాల ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద జరిగిన ధర్నాలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, శంకర్‌విలాస్‌ వద్ద జరిగిన నిరసనలో ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు. బంద్‌ సందర్భం గా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మనోజ్‌కుమార్‌  మాట్లా డుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తే రాష్ట్రంలో బీజేపీ నాయకుల్ని ఎక్కడా తిరగనివ్వమని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌, ఏఐటీయూసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రాధాకృష్ణమూర్తి, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి కృష్ణ, గనిరాజ్‌ సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, బ్రహ్మయ్య, సీపీఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, నళినీకాంత్‌, భావన్నారాయణ, ముత్యాలరావు, సత్యనారాయణ, ఎల్‌ అరుణ, మస్తాన్‌వలి,  అరుణ్‌కుమార్‌, అంజిబాబు, టీడీపీ నాయకులు నాయుడు ఓంకార్‌, కసుకుర్తి హనుమంత రావు, మన్నవ వెంకటేశ్వరరావు, వెంకటరమణ, వేగుంటరాణి, బెల్లంకొండ సురేష్‌ ఎస్‌ఎఫ్‌ఐ నాయ కులు ఎం కిరణ్‌, కే సూర్య, పూర్ణ, మహేష్‌, సాయి, నాగూర్‌బీ, సాయితేజ, మాధవరావు, రారాజు, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.


ఏఎన్‌యులో బంద్‌ విజయవంతం

ఆచార్య నాగార్జున యూనివర్పిటీలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బంద్‌ విజయవంతమైంది. విద్యార్థులు తరగతులను బహిష్కరించి స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భగవాన్‌దాస్‌ మాట్లాడుతూ రెండో సారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు స్థాపించడం చేతగాక ఆదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఉన్న ఉద్యోగాలను లేకుండా చేసి నిరుద్యోగ భారతావనిని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు భాను ప్రసాద్‌, వైసీపీ కార్మిక సంఘం నాయకులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మనోజ్‌, రాజు, అమూల్య తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వ్యాప్తంగా.. జయప్రదం

రాష్ట్ర బంద్‌ జిల్లావ్యాప్తంగా జయప్రదంగా జరిగింది.  అఖిలపక్ష నాయకులు చిలకలూరిపేటలో ప్రదర్శన నిర్వహించారు. బాపట్లలో సీపీఎం, సీఐటీయు, న్యూడెమోక్రసి ఎంఎల్‌, ఎస్‌ఎఫ్‌ఐ, కార్మికసంఘాలు ఆధ్వర్యంలో బ్యాంక్‌ను, విద్యాసంస్థలు, వాణిజ్య దుకాణాలను మూసివేయించారు. నరసరావుపేటలో విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసి వేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు పాక్షికంగా మూతపడ్డాయి. ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జిలు ధరించి విధులకు హాజరయ్యా రు. బంద్‌కు నరసరావుపేటలో న్యాయవాదులు మద్దతు తెలిపారు. సత్తెనపల్లిలో  వివిధ ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. పల్నాడు ప్రాంతంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. పిడుగురాళ్లలో సీపీఎం, సీపీఐ రైతుకూలీసం ఘం, వామపక్షాల నేతలు భారీగా హాజరై ర్యాలీ నిర్వహించారు. విశాఖ పరిరక్షణ కమిటీ ఆద్వర్యంలో రేపల్లె లో  సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. తాడికొండ అడ్డరోడ్డు లో, ఫిరంగిపురంలోని సత్తెనపల్లి బస్టాప్‌ వద్ద రాస్తా రోకో నిర్వహించారు. తుళ్లూరు మండల పరిధిలోని అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. టీడీపీ తో పాటు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆం ధ్రుల హక్కు అమరావతిని కాపాడుకుందాం అంటూ మహిళలు నినాదాలతో ప్రదర్శన చేశారు. వెలగపూడి సచివాయానికి వెళ్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకావిజయ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ అమ్మేదెవడురా.. కొనేదేవడురా.. విశాఖ ఉక్కు ఆం ధ్రుల హక్కు అంటూ తెనాలిలో యువజన సంఘాలు, అఖిలపక్ష నాయకులు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థులు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. పొన్నూరులో విద్య, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లను నిర్వాహకులు స్వచ్ఛందంగా మూసివేసి సంఘీభావం తెలిపారు. వినుకొండలోని శివయ్యస్థూపం సెంటర్‌లో టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల అనుబంధ సంఘాలతో కలిసి నిరసన తెలిపారు. మంగళగిరిలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. తాడేపల్లి ఉండ వల్లి సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు.


 

Updated Date - 2021-03-06T06:17:33+05:30 IST