ప్రభుత్వ లక్ష్య సాధనలో బ్యాంకర్లు సహకరించాలి
ABN , First Publish Date - 2022-09-29T06:20:39+05:30 IST
ప్రభుత్వ లక్ష్య సాధనలో బ్యాంకర్లు సహకరించాలి కలెక్టర్ గుగులోతు రవినాయక్ అన్నారు. బుధవారం పట్టణం లోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో 2022 జూన్కు సంబందించిన డీసీసీ, డీఎల్ఆర్సీ త్రైమాసిక సమీక్ష నిర్వహించారు.
జగిత్యాల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ లక్ష్య సాధనలో బ్యాంకర్లు సహకరించాలి కలెక్టర్ గుగులోతు రవినాయక్ అన్నారు. బుధవారం పట్టణం లోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో 2022 జూన్కు సంబందించిన డీసీసీ, డీఎల్ఆర్సీ త్రైమాసిక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు తక్షణం రుణ సదుపాయం అందేలా కృషి చేయాలన్నారు. జిల్లాలోని బ్యాంకు రుణ లక్ష్యాలు జూన్ 30వ తేదీ నాటికి సంబందించిన అంశాలపై మాట్లాడారు. గత సమావేశంలో చర్చించిన అంశాల పట్ల బ్యాంకర్లు, అధికారులు తీసుకున్న చర్యలను సమీక్షించారు. జిల్లాలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద పెండింగ్లో ఉన్న 55 యూనిట్లను తక్షణమే గ్రౌండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో యాసంగి వ్యవసాయ రుణాలకు సంబందించి రూ. 284 కోట్ల పంట రుణం, రూ. 163 కోట్ల వ్యవసాయ టర్మ్ రుణాలను మంజూరు చేస్తూ వార్షిక రుణప్రణాళిక కింద మొత్తం రూ. 590 కోట్ల రుణాలను మంజూరు చేశా మన్నారు. వీధి వ్యాపారులకు సంబందించి మొదటి విడతలో 11,320 మందికి, రెండవ విడతలో 4,000 మందికి రుణాలు మంజూరు చేశామన్నారు. మూడో విడత రుణాలు ఆశాజనకంగా లేవని దీనిపై అన్ని బ్యాంకులు తక్షణం అర్హులైన లబ్ధిదారులకు రుణ సదుపాయం అందించాలని ఆదేశించారు. అదేవిదంగా సూక్ష్మ, చిన్న, మద్యతరహా రుణాల కింద రూ. 86 కోట్లు, ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం కింద 23 మందికి మంజూరు చేశామన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్వశక్తి మహిళలకు రూ. 109 కోట్లు, పట్టణ ప్రాంత సంఘా లకు రూ.19 కోట్లు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ పొన్నం వెంకటరెడ్డి, ఆర్బీఐ ఎల్డీఓకే అనిల్ కుమార్, నాబార్డ్ ఏజీఎం అనంత్, యూనియన్ బ్యాంకు ఆప్ ఇండియా రీజనల్ మేనేజర్ అరుణ్ కుమార్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఫణి శ్రీనివాసులు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.