16, 17 తేదీల్లో బ్యాంకుల సమ్మె
ABN , First Publish Date - 2021-12-08T07:20:53+05:30 IST
ఈనెల 16, 17 తేదీల్లో జిల్లావ్యాప్తంగా బ్యాంకుల సమ్మె చేపడుతున్నట్లు సంఘ నేతలు ప్రకటించారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 7: బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మంగళవారం సాయంత్రం చిత్తూరు ఓటీకే రోడ్డులోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ, ప్రైవేటీకరణను మానుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ నేతలు టి.శేఖర్, శ్రీహరి తదితరులు మాట్లాడారు. ప్రధాని మోదీ.. ప్రభుత్వరంగ సంస్థలను, బ్యాంకింగ్ వ్యవస్థలను కార్పొరేట్ శక్తులకు విక్రయిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి నిరసనగా ఈనెల 16, 17 తేదీల్లో జిల్లావ్యాప్తంగా బ్యాంకుల సమ్మె చేపడుతున్నట్లు ప్రకటించారు. సీఐటీయూ జిల్లాకార్యదర్శి పి.చైతన్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజన్, తదితరులు పాల్గొన్నారు.