Dubai: దుబాయిలో GTWCA బతుకమ్మ ధూంధాం

ABN , First Publish Date - 2022-10-03T22:30:53+05:30 IST

తెలంగాణ ప్రవాసీయులకు అనువుగా ఉండే విధంగా దుబాయి, షార్జా నగరాలకు సమీపాన ఉన్న అల్ అహ్లీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం జి.టి.డబ్ల్యూ.సి.ఏ నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

Dubai: దుబాయిలో GTWCA బతుకమ్మ ధూంధాం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయి... ఎక్కడో హైద్రాబాద్ నుండి 2500 కిలో మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తెలంగాణ ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత జీవన విధానంతో అనుసంధామైన నగరం. తెలంగాణ.. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ప్రతి పల్లెతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్న నగరం. అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ బయట.. విదేశాలలో అమెరికా, యూరోప్ కంటే కూడా ముందుగా తెలంగాణ ధూంధాం ద్వారా తమ అకాంక్ష గళాన్ని గట్టిగా వినిపించిన నగరం దుబాయి.


అలాంటి దుబాయి నగరంలో మొదటిసారిగా బతుకమ్మ వేడుకలకు 15 సంవత్సరాల క్రితం నాంది పలికింది. దుబాయిలోని తెలంగాణ ప్రవాసీయుల ప్రప్రథమ సంఘమైన గల్ఫ్ తెలంగాణ వెల్ఫర్, కల్చరల్ అసోసియేషన్ (జి.టి.డబ్ల్యూ.సి.ఏ).. అనేక అవరోధాలను ఎదుర్కొంటూ మొక్కవోని మొండి ధైర్యంతో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను నిర్వహించింది. ఆ రకంగా దుబాయిలో అంకుర్పాణ జరిగిన బతుకమ్మ సంబురాలు నేడు ఒక కీలక ఘట్టంగా మారి అనేక సంఘాలు పోటిపడి చేసే స్థాయికి చేరుకున్నాయి.


గత మూడేళ్ళుగా కరోనా, ఆర్థిక మాంద్యం కారణాన ఒకింత నిరాడంబరంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలను మళ్ళీ ఈసారి నూతనోత్తేజంతో నిర్వహించారు. తెలంగాణ ప్రవాసీయులకు అనువుగా ఉండే విధంగా దుబాయి, షార్జా నగరాలకు సమీపాన ఉన్న అల్ అహ్లీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం జి.టి.డబ్ల్యూ.సి.ఏ నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గోదావరి నదికి దిగువన ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సుందర ఉపసాన నుండి మోదలు ఇటు గోదావరి ఎగువలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన పాలడుగు సబితా రెడ్డి వరకు వైవిధ్యభరితమైన సామాజిక నేపథ్యాల కూర్పులతో కూడుకున్న మహిళామణులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరాయి దేశంలో తమ బాధ్యతగా నిర్వహించిన పండుగ బతుకమ్మ. తాము పేరుస్తున్న బతుకమ్మ పూలను చూసి ముచ్చటపడి తమకు తెలిసిన పాకిస్తానీ యువతి ఒకరు వచ్చి బతుకమ్మ ఆడిందని ఉపాసన చెప్పారు.


బతుకమ్మ ఒక వేడుక మాత్రమే కాదు, తమ అస్తిత్వానికి ప్రతీక అని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్‌కు  చెందిన జె.సౌమ్య రాణి చేసిన వ్యాఖ్యతో పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన సుద్దాల విజేత ఏకీభవించారు. బతుకమ్మ అంటే ఇప్పుడు గౌరవంతో కూడుకొందని వరంగల్ నగరానికి చెందిన రేవూరి సబితా రెడ్డి అన్నారు. దుబాయి బతుకమ్మ సంబురాల నిర్వహణలో నాగమణి దామోర, విజేత, జ్యోతి, సబితా, ప్రియా, అవంతిక, భారతీ, శ్రీవాణి, ఉషా ప్రియాంక, ఉపాసన కీలక పాత్ర వహించగా జి.టి.డబ్ల్యూ.సి.ఏ బాధ్యులు జువ్వాడి శ్రీనివాసరావు, సలాఓద్దీన్, సామ్యూల్, కటుకం రవి, మల్లేశ్‌లు ఇతర నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.



Updated Date - 2022-10-03T22:30:53+05:30 IST