మెదక్‌ జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-10-01T04:45:43+05:30 IST

మెదక్‌లోని బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి మహిళలు తరలివచ్చారు.

మెదక్‌ జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబురాలు
మెదక్‌లో బతుకమ్మ ఆడుతున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తదితరులు

కళాకారుల ఆట, పాటలతో హోరెత్తిన ప్రాంగణం 

బతుకమ్మ ఆడిన మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ 


మెదక్‌ కల్చరల్‌, సెప్టెంబరు 30: మెదక్‌లోని బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి మహిళలు తరలివచ్చారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారుల ప్రదర్శనలతో ప్రాంగణమంతా మార్మోగింది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి హారతిచ్చి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. పురాణాలు, ఇతిహాసాలు మొదలుకొని తెలంగాణ ఉద్యమ అమరుల త్యాగాలను కీర్తిస్తూ పాటలు పాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకును కొలిచే పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచులకే ఈ సంప్రదాయం ప్రత్యేకమని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లిఖార్జున్‌గౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ బట్టి జగపతి, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.  మెదక్‌ కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సహకార శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.

Updated Date - 2022-10-01T04:45:43+05:30 IST