బంగాళాఖాతంలో వాయుగుండం
ABN , First Publish Date - 2022-03-21T00:10:44+05:30 IST
ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయానికల్లా వాయుగుండంగా బలపడింది.
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయానికల్లా వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తర ఈశాన్యంగా పయనించి ఆదివారం మధ్యాహ్ననికి కార్నిరోబార్ దీవులకు 140 కి.మీ. ఉత్తరంగా, పోర్టుబ్లెయిర్కు 140 కి.మీ. దక్షిణంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తరంగా అండమాన్ దీవుల మీదుగా పయనించే క్రమంలో సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, ,రాత్రికి తుఫాన్గా మరింత బలపడనున్నది. దీనికి ‘అసాని’ అని పేరు పెట్టనున్నారు. ఇదిలావుండగా 1891 నుంచి 2020వ సంవత్సరం వరకు మార్చి నెలలో ఉత్తర హిందూ మహాసముద్రంలో ఎనిమిది తుఫాన్లు ఏర్పడగా వాటిలో ఆరు బంగాళాఖాతంలోనే ఏర్పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటిలో తీవ్రతుఫాన్ 1907లో శ్రీలంకలో, తుఫాన్ 1925లో తమిళనాడు వద్ద తీరం దాటాయని పేర్కొంది.