BCCI Selection: ఇంగ్లాండ్పై చివరి టెస్టు ఆడనున్న టీం ఇదే..
ABN , First Publish Date - 2022-05-23T01:05:13+05:30 IST
గతేడాది కరోనా మహమ్మారి కారణంగా ఇంగ్లాండ్ - ఇండియా 5 టెస్టుల సిరీస్లో రీషెడ్యూల్ అయిన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడబోయే 17 మంది సభ్యుల బృందాన్ని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది.
ముంబై : గతేడాది కరోనా మహమ్మారి కారణంగా ఇంగ్లాండ్ - ఇండియా మధ్య 5 టెస్టుల సిరీస్లో రీషెడ్యూల్ అయిన చివరి టెస్ట్ మ్యాచ్కు 17 మంది సభ్యుల బృందాన్ని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. స్వదేశంలో శ్రీలంక సిరీస్లో చోటు కోల్పోయిన చెతేశ్వర్ పుజారాను తిరిగి జట్టులోకి తీసుకుంది. కౌంటీ చాంపియన్షిప్లో ససెక్స్ తరపున ఆడుతున్న పుజారా అద్భుతమైన ఫామ్లో ఉండడంతో పిలుపు అందింది. అయితే గతేడాది ఇంగ్లాండ్ టూర్ జట్టులో ఉన్న బ్యాట్స్మెన్ అజింక్యా రహానేకి ఈసారి చోటు దొరకలేదు. గాయం కారణంగా రహానే ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బౌలర్ల విషయానికి వస్తే ఐపీఎల్లో రాణిస్తున్న పేసర్ ప్రసిద్ కృష్ణకు కూడా చోటుదక్కింది. కాగా ఇండియా టెస్ట్ స్క్వాడ్లో చోటు కోల్పోయిన ఆటగాళ్లలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా ఉన్నాడు. వేగంగా బంతులు సంధిస్తున్న ప్రసిద్ కృష్ణ వైపే సెలక్టర్లు మొగ్గుచూపడంతో ఇషాంత్ శర్మపై వేటుపడింది. కాగా ఐపీఎల్లో వేగవంతమైన బంతులతో సంచలనం సృష్టించిన ఉమ్రాన్ మాలిక్కు టెస్టు స్క్వాడ్లో చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్లో మాత్రం చోటుదక్కింది. దీంతో సునీల్ గవాస్కర్, కెవిన్ పీటర్సన్ వంటి దిగ్గజ క్రికెటర్ల అంచనాలు తప్పాయి. ఇంగ్లాండ్పై టెస్టు మ్యాచ్ ఆడించాలని వారు సూచించిన విషయం తెలిసిందే.
రవీంద్ర జడేజాకి చోటు
ఐపీఎల్లో గాయం కారణంగా అర్ధాంతరంగా ఆటకు దూరమైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకి కూడా టెస్ట్ టీంలో చోటుదక్కింది. రవిచంద్రన్ అశ్విన్ మరో స్పిన్నర్గా టీంలో ఉంటాడు. కాగా రిషత్ పంత్కు బ్యాక్ అప్ వికెట్ కీపర్గా కేఎస్ భరత్కు ఇంగ్లాండ్ వెళ్లే టీంలో అవకాశం దక్కింది. జూన్ 15న టీమిండియా ఇంగ్లాండ్ బయలుదేరుతుంది. నాలుగు రోజులపాటు వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. లిసెస్టర్షైర్పై జరిగే ఈ మ్యాచ్ జూన్ 24న మొదలవుతుంది. టెస్ట్ మ్యాచ్ జులై 1న మొదలవుతుంది. కాగా చివరి టెస్ట్ మ్యాచ్ మాత్రమే కాకుండా టీమిండియా- ఇంగ్లాండ్లు జులై 7 నుంచి 17 మధ్య 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఆడనున్నాయి.
ఇంగ్లాండ్పై చివరి టెస్టు టీం ఇదే..
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చెతేశ్వర పుజార, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేఎస్ భరత్ వికెట్ కీపర్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, శార్ధూల్ థాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ క్రిష్ణ.