ఇండియాలోనే ఐపీఎల్.. నమ్మకంగా ఉన్న బీసీసీఐ
ABN , First Publish Date - 2022-01-22T23:20:09+05:30 IST
కరోనా వైరస్ విజృంభణ కారణంగా గతేడాది ఐపీఎల్లో రెండో సగం మ్యాచ్లు యూఏఈకి తరలిపోగా, అంతకుముందు..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ కారణంగా గతేడాది ఐపీఎల్లో రెండో సగం మ్యాచ్లు యూఏఈకి తరలిపోగా, అంతకుముందు ఏడాది కూడా యూఏఈ వేదికగానే ఐపీఎల్ జరిగింది. అయితే, ఈసారి మాత్రం భారత్లోనే నిర్వహించాలని బీసీసీఐ గట్టి పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ, ఐపీఎల్ జరిగే సమయానికి పరిస్థితులు అనుకూలించకుంటే కనుక టోర్నీని ఏ దేశానికి తరలించాలన్న దానిపైనా బీసీసీఐ ఇప్పటికే ఓ ప్రణాళిక వేసుకున్నట్టుగా సమాచారం.
ఈసారి ఐపీఎల్ను ముంబై, పూణె వేదికలపై నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ రెండు నగరాల్లో నిర్వహించడం వల్ల ఓ క్లస్టర్ను తయారు చేసుకుని రోడ్డు ప్రయాణానికి దానిని ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా విమాన ప్రయాణం ద్వారా కలిగే కొవిడ్ ముప్పును తగ్గించుకోవచ్చన్నది బీసీసీఐ భావన. అయితే, ఒకవేళ ఐపీఎల్ను భారత్లో కనుక నిర్వహించడం సాధ్యం కాకుంటే యూఏఈ, లేదంటే దక్షిణాఫ్రికాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. అయితే, బీసీసీఐ మాత్రం శ్రీలంకను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది.