వృద్ధిమాన్ సాహా ట్వీట్‌పై దర్యాప్తునకు సిద్ధమైన బీసీసీఐ

ABN , First Publish Date - 2022-02-22T02:14:05+05:30 IST

గుర్తు తెలియని జర్నలిస్టు నుంచి టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు

వృద్ధిమాన్ సాహా ట్వీట్‌పై దర్యాప్తునకు సిద్ధమైన బీసీసీఐ

న్యూఢిల్లీ: గుర్తు తెలియని జర్నలిస్టు నుంచి టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు వచ్చిన బెదిరింపు సందేశాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లపై బీసీసీఐ విచారణకు సిద్ధమైంది. సాహా ఈ నెల 19న ఓ జర్నలిస్టుతో జరిగిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. టెస్టు జట్టులో తనను ఎంపిక చేయని విషయమై మాట్లాడేందుకు ఓ జర్నలిస్టు ప్రయత్నించాడని పేర్కొన్నాడు. అయితే, అందుకు తాను నిరాకరించానన్నాడు.  దీంతో అతడు తనను బెదిరించాడని చెబుతూ, జర్నలిజం మరీ ఇంతగా దిగజారిపోయిందా? అని ఆవేదన వ్యక్తం చేశాడు.


దీనిపై స్పందించిన ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయాన్ని బీసీసీఐ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. భవిష్యత్తులో ఇలాంటి బెదిరింపులకు గురికాకుండా ఇతర ఆటగాళ్ల ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేయాలని కోరింది. ఇందులో భాగంగా ఈ విషయమై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.


మరోవైపు, ఈ బెదిరింపు విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ.. జర్నలిస్టుతో జరిగిన సంభాషణకు సంబంధించి వృద్ధిమాన్‌ను అడిగి ధ్రువీకరించుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆ జర్నలిస్టు ఎవరన్న విషయాన్ని సాహా వెల్లడించలేదు.   



Updated Date - 2022-02-22T02:14:05+05:30 IST