పట్టపగలే బీభత్సం.. బీసెంట్ రోడ్డులో రెండు వర్గాల కొట్లాట
ABN , First Publish Date - 2020-09-23T16:48:47+05:30 IST
ఇటీవల పటమట డొంక రోడ్డులో జరిగిన గ్యాంగ్వార్ ఘటన మరువక ముందే..
సోడాలు, వేడి నూనెతో దాడులు
ఒకరికి గాయాలు
విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఇటీవల పటమట డొంక రోడ్డులో జరిగిన గ్యాంగ్వార్ ఘటన మరువక ముందే మరో రెండు గ్యాంగ్లు పట్టపగలే బీభత్సం సృష్టించాయి. నిత్యం రద్దీగా ఉండే బీసెంట్ రోడ్డులో మంగళవారం ఉదయం ఒకరిపై ఒకరు సోడాలు, మరిగే నూనె విసురుకుని భయానకర వాతావరణాన్ని సృష్టించారు. కృష్ణలంకకు చెందిన సాంబయ్య సోమవారం ఐదో నంబర్ రూటులోని శ్రీరాము ఫ్రూట్జ్యూస్ షాపునకు వెళ్లగా షాపు యజమాని పేరం నాగేశ్వరరెడ్డి సాంబయ్యను చెప్పులు విడిచి రమ్మన్నాడు. తర్వాత కొంతమంది చెప్పులతో షాపులోకి రాగా వాళ్లు చెప్పులతో వస్తే తననెందుకు బయట విడవమన్నావని నాగేశ్వరరెడ్డిని నిలదీయగా గొడవ పెరిగి సాంబయ్యతోపాటు కొండలరావు మరికొంతమంది నాగేశ్వరరెడ్డిపై దాడిచేశారు.
దీనికి ప్రతీకారంగా నాగేశ్వరరెడ్డి సోదరుడు బ్రహ్మారెడ్డి మరో ఐదుగురు కలిసి మంగళవారం ఐదో నెంబర్ రూట్లో టిఫిన్ చేస్తున్న సాంబయ్య, కొండలరావు వర్గంపై దాడిచేశారు. బ్రహ్మారెడ్డి వర్గం సాంబయ్య వర్గీయులపైకి సోడాలు విసర గా, స్టౌపై మరుగుతున్న నూనె కళాయిని సాంబయ్య వర్గం బ్రహ్మారెడ్డి వర్గంపైకి విసిరింది. దీంతో సాంబయ్య తలకు బలమైన గాయం కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రెండు వర్గాలు గవర్నరుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసులు నమోదు చేశారు.