బీటౌన్లో న్యూబీస్
ABN , First Publish Date - 2021-01-10T06:04:36+05:30 IST
ఇండస్ట్రీకి ఎప్పుడు వస్తున్నారనేది ముఖ్యం కాదు...ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంటారా? లేదా?అనేది మాత్రమే ముఖ్యం! గమనించదగ్గ
ఇండస్ట్రీకి ఎప్పుడు వస్తున్నారనేది ముఖ్యం కాదు...ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంటారా? లేదా?అనేది మాత్రమే ముఖ్యం! గమనించదగ్గ అంశం!!అందుకని, ప్రతి ఏడాదీ న్యూబీస్ (కొత్తగా వచ్చే వాళ్లు)ఎవరు? ఎవరు?? అని ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు ఓ లుక్కేస్తారు.ఈ ఏడాదీ (2021లో) హిందీ చలన చిత్ర పరిశ్రమలో కొంతమంది కొత్తమ్మాయిలు అడుగుపెడుతున్నారు.బీటౌన్లోకి వస్తున్న ఆ న్యూబీస్... బ్యూటీస్ ఎవరు?వాళ్లు ఏ హీరోతో నటిస్తున్నారు? చూడండి!
సిద్ధాంత్ చతుర్వేదితో...
శర్వరీ వాఘ్...
‘ద అన్ఫర్గెటన్ ఆర్మీ - ఆజాదీ కే లియే’ వెబ్ సిరీ్సతో వెలుగులోకి వచ్చిన ముంబై ముద్దుగుమ్మ. నటిగా ఆమె తొలి ప్రాజెక్టు అది. వెబ్ ప్రపంచంలో విజయం అందుకున్న ఆమె... ఇప్పుడు ‘బంటీ ఔర్ బబ్లీ 2’తో బాలీవుడ్లో అడుగు పెడుతున్నారు. సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖర్జీ ఓ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘గల్లీ బాయ్’ ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది, శర్వరి మరో జంటగా నటిస్తున్నారు. పదేళ్ల తర్వాత సీక్వెల్ వస్తుండటం, క్రేజీ కాంబినేషన్లు కుదరడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
అమితాబ్ కుమార్తెగా...
క్రిస్టల్ డిసూజా...
ఉత్తరాది బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలే! ‘ఏక్ హజారో మే మెరీ బెహన్ హై’, ‘ఏక్ నయీ పెహచాన్’, ‘బ్రహ్మరాక్షస్’ వంటి టీవీ షోల్లో నటించారు. ‘ఫిరాట్’ వెబ్ సిరీస్ చేశారు. గతంలో ‘సి కంపెనీ’లో చిన్న అతిథి పాత్ర చేశారు. బిగ్ బి అమితాబ్, ఇమ్రాన్ హష్మి నటిస్తున్న ‘చెహరే’తో ఈ ఏడాది హిందీ వెండితెరకు పరిచయం కానున్నారు. అందులో అమితాబ్ కుమార్తెగా కనిపించనున్నారు. తొలుత ఈ పాత్ర మౌనీ రాయ్, అంకితా లోఖండే దగ్గరకు వెళ్లింది. వాళ్లిద్దరూ తిరస్కరించడంతో క్రిస్టల్ డిసూజాను అదృష్టం వరించింది.
ఆయుష్ శర్మతో...
ఇజబెల్లా కైఫ్...
కట్రీనా కైఫ్ చెల్లెలుగా హిందీ ప్రేక్షకులకు తెలిసిన ముఖమే! హిందీ చలన చిత్రసీమకు ఇజబెల్లా కైఫ్ కథానాయికగా పరిచయం కానున్నారనే మాట కూడా ఇప్పటిది కాదు. ఎప్పట్నుంచో వినిపిస్తోంది. అయితే, ఈ ఏడాది కార్యరూపం దాల్చుతోంది. కట్రీనా కైఫ్కు అవకాశాలు ఇవ్వడంతో పాటు ఆమెను స్టార్గా నిలబడటంలో సల్మాన్ ఖాన్ది ముఖ్య పాత్ర. ఇప్పుడు కట్రీనా చెల్లెల్ని ఆయనే పరిచయం చేస్తున్నారు. బావ ఆయుష్ శర్మ హీరోగా నిర్మిస్తున్న ‘క్వత’లో ఇజబెల్లా కైఫ్కు కథానాయికగా అవకాశం ఇచ్చారు సల్మాన్. అన్నట్టు... గతంలో ఇండో కెనడియన్ చిత్రం ‘డాక్టర్ క్యాబీ’లో ఆమె చిన్న పాత్ర పోషించారు. దానికి సల్మాన్ సహ నిర్మాత. మరో మ్యూజిక్ వీడియోలో నటించారు. ఇన్నాళ్లకు నాయికగా సినిమా చేస్తున్నారు.
రణ్వీర్ సింగ్తో...
షాలినీ పాండే...
తెలుగునాట ‘అర్జున్రెడ్డి’తో ఈమెకు విపరీతమైన గుర్తింపు లభించింది. అసలు పేరుతో కంటే సినిమాలో పాత్ర పేరు ప్రీతిగా ఈమెను పిలిచే ప్రేక్షకులు ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. ‘అర్జున్రెడ్డి’ తర్వాత ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’, ‘నిశ్శబ్దం’ చిత్రాల్లో నటించారు. అయితే, ‘118’ మినహా మిగతా రెండూ పరాజయాలే. ‘జీ 5’ ఓటీటీలో విడుదలైన హిందీ చిత్రం ‘బాంఫడ్’ సైతం పరాజయాన్ని మిగిల్చింది. అయినా షాలినీ పాండే ధైర్యంగా ఉన్నారంటే... ‘జయే్షభాయ్ జోర్దార్’ చిత్రమే.
అందులో రణ్వీర్ సింగ్కి జంటగా నటిస్తున్నారు. పైగా, ఆ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. లెక్క ప్రకారం బాలీవుడ్ ఎంట్రీ అదే అవుతుంది. వరుస విజయాలతో జోరు మీదున్న రణ్వీర్ కథానాయకుడు కాబట్టి... ‘జయే్షభాయ్ జోర్దార్’తో తనకు మంచి గుర్తింపు రావడం ఖాయమనే ధీమాతో ఉన్నారట. అన్నట్టు... ఇదీ యశ్ రాజ్ ఫిల్మ్స్ చిత్రమే.
సిద్ధార్థ్ మల్రోత్రాతో...
రష్మిక...
ప్రస్తుతం తెలుగులోని అగ్ర కథానాయికల్లో ఒకరు. అల్లు అర్జున్ ‘పుష్ప’, శర్వానంద్ ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’లో నటిస్తున్నారు. అలాగే, ఈ ఏడాది బాలీవుడ్ విమానం ఎక్కుతున్నారు. సిద్ధార్థ్ మల్రోత్రా కథానాయకుడిగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’లో ఆమె నటిస్తున్నారు. ఇండియన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ఏజెంట్గా హీరో పాత్ర ఉంటుందని చిత్రబృందం వెల్లడించింది. రష్మిక పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి సస్సెన్స్. గత వారం ఈ సినిమా చిత్రీకరణ కోసం ఆమె ముంబై వెళ్లారు. ముస్లిం యువకుడిగా సిద్ధార్థ్, అతని వెనుక స్కూటర్పై రష్మిక కూర్చున్న స్టిల్స్ లీక్ అయ్యాయి కూడా!
అక్షయ్ కుమార్తో...
మానుషీ చిల్లర్...
మాజీ ప్రపంచ సుందరి. 2017లో అందాల పోటీల్లో కిరీటం సొంతం చేసుకున్నారీమె! అలాగే, కుర్రకారు మనసు దోచుకున్నారు. అందాల పోటీల్లో విజేతగా నిలిచిన అమ్మాయిలు అక్కణ్ణుంచి రంగుల ప్రపంచంలోకి అడుగు వేయడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ! దానిని అనుసరిస్తూ... మానుషీ చిల్లర్ హిందీ చిత్రసీమలోకి వస్తున్నారు. అదీ తొలి చిత్రంలోనే అగ్ర హీరో అక్షయ్ కుమార్తో నటించే అవకాశం అందుకున్నారు. అక్షయ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’లో మానుషి కథానాయిక. రాజు ప్రేయసి సనయోగిత పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఒకప్పుడు ఉత్తరాదిన పరిపాలించిన చౌహన్ రాజ్యవంశస్థుల్లో మూడో పృథ్వీరాజ్ చౌహన్ జీవితం ఆధారంగా రూపొందుతోంది.
కరోనా కారణంగా 2020లో థియేటర్లలో విడుదలైన సినిమాల సంఖ్య తక్కువ. అలాగే, హిందీ చిత్రసీమకు పరిచయమైన కొత్తమ్మాయిల సంఖ్య సైతం చాలా తక్కువ. అందుకని, ఈ ఏడాది కథానాయికలుగా పరిచయమవుతున్న అమ్మాయిలపై ఎక్కువ దృష్టి పడుతోంది. ఈ జాబితాలో మరికొందరు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్లలో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకునేది ఎందరో వేచి చూడాలి.