కరోనా కాలంలో టీచర్ ఉద్యోగం పోవడంతో స్ట్రాబెరీ సాగు చేస్తూ....

ABN , First Publish Date - 2021-02-17T14:20:17+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన రమేష్ మిశ్రా...

కరోనా కాలంలో టీచర్ ఉద్యోగం పోవడంతో స్ట్రాబెరీ సాగు చేస్తూ....

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన రమేష్ మిశ్రా ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో కరోనా కాలం వచ్చి అతని జీవితం తలకిందులైపోయింది. స్కూలు ఉద్యోగంలో సమస్యలు తలెత్తడంతో రమేష్ స్కూలు మానివేశారు. అయితే ఇకపై ఏం చేయాలనే సమస్య తలెత్తింది. చాలా ఆలోచించిన తరువాత స్ట్రాబెరీ సాగుచేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఉద్యోగం కోల్పోయిన ఒక స్నేహితుని సాయంతో రమేష్ స్ట్రాబెరీ సాగు ప్రారంభించారు. మొదట్లో స్ట్రాబెరీ సాగు కష్టమనినించినా, మెల్లమెల్లగా గాడిలో పడి స్ట్రాబెరీ విక్రయాలతో లాభాలు రాసాగాయి. 


ఇప్పుడు స్ట్రాబెరీల సాగుతో రమేష్ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఫుడ్, కాస్మొటిక్ ఇండస్ట్రీలో స్ట్రాబెరీకి ఎంతో డిమాండ్ ఉంది. వారణాసికి సమీపంలోని ఒక గ్రామానికి చెందిన రమేష్ బీహెచ్‌యూలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పదేళ్లపాటు ఉపాధ్యాయవృత్తిలో కొనసాగిన రమేష్ మాట్లాడుతూ... లాక్‌డౌన్ సమయంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో నేను కూడా ఇతర ఉద్యోగాలపై దృష్టి సారించాను. రోజుల తరబడి ఇంటర్నెట్‌లో ఉద్యోగాల కోసం వెదికి విసిగిపోయాను. అయితే కొందరి సలహాతో స్ట్రాబెరీ సాగు ప్రారంభించాను. ఇందుకోసం పూణెలోని స్ట్రాబెరీ సాగుచేసే నిపుణుల సలహాలు తీసుకున్నాను. రెండెకరాల భూమిలో 15 వేల స్ట్రాబెరీ మొక్కలు నాటాను. ఒక్కో మొక్కను 15 రూపాయలకు కొనుగోలు చేశాను. డ్రిప్ ఇరిగేషన్ విధానంలో సాగుప్రారంభించాను. ఇందుకోసం ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకూ ఖర్చుచేశాను. ప్రస్తుతం మంచి దిగుబడి వస్తుండటంతో కిలో స్ట్రాబెరీ రూ. 300 చొప్పున విక్రయిస్తున్నాం. ఇకపై ఇదే సాగును కొనసాగించాలను కుంటున్నానని తెలిపారు. 

Updated Date - 2021-02-17T14:20:17+05:30 IST