శ్రీమద్రామాయణ పారాయణం ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-26T06:21:47+05:30 IST

శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని కోరుతూ తిరుమలలోని వసంత మండపంలో శ్రీమద్రామాయణ పారాయణం ఆదివారం ప్రారంభమైంది.

శ్రీమద్రామాయణ పారాయణం ప్రారంభం
పారాయణంలో పాల్గొన్న వేద పండితులు

తిరుమల, జూలై 25 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని కోరుతూ తిరుమలలోని వసంత మండపంలో శ్రీమద్రామాయణ పారాయణం ఆదివారం ప్రారంభమైంది. ఆగస్టు 23వ తేదీ వరకు 30 రోజుల పాటు ఈ పారాయణం జరగనుంది. ఈ సందర్భంగా వేదవిజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌ కేఎస్‌ఎస్‌ అవధాని మాట్లాడుతూ.. శ్రీమద్రామాయణ పారాయణం ఒక జ్ఞాన యజ్ఞమన్నారు. వేదస్వరూపమైన రామాయణ పారాయణం ద్వారా భక్తి, జ్ఞానం, వైరాగ్యం, చిత్తశుద్ధి కలుగుతాయని, వీటిద్వారా మోక్షం లభిస్తుందన్నారు. మోక్షసాధనే మానవ జీవితానికి సార్థకత  అన్నారు. ఈ పారాయణ గ్రంథాన్ని ఎస్వీబీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండలోని ప్రధానమైన సర్గలను రోజుకు ఒకటి చొప్పున పారాయణం చేస్తామన్నారు. జన్మాంతర సకలసౌఖ్యప్రాప్తి కోసం యుద్ధకాండలోని 131వ సర్గల్లోని 120 శ్లోకాలను 30 రోజులపాటు పారాయణం చేస్తామని వివరించారు. మరోవైపు ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో ఉదయం, సాయంత్రం వేళల్లో హోమాలు, జపాలు, హనుమంత, సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని మూలమంత్రానుష్టానం జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో 32 మంది వేదపండితులు పాల్గొంటారన్నారు. తొలి రోజున ధర్మకార్యసిద్ధి కోసం అయోధ్యకాండలోని 21 నుంచి 25 సర్గల్లో ఉన్న 221 శ్లోకాలు, జన్మాంతర సకలసౌఖ్యప్రాప్తి కోసం యుద్ధకాండలోని 131వ సర్గలో ఉన్న 120 శ్లోకాలు కలిపి మొత్తం 341 శ్లోకాలను పారాయణం చేశారు. 

Updated Date - 2021-07-26T06:21:47+05:30 IST