భారత్లోని ఈ మూడు నగరాలకే NRI ల ఓటు.. పెట్టుబడి పెట్టేందుకు ప్రవాసులు క్యూ కడుతున్నారట..!
ABN , First Publish Date - 2022-05-24T02:03:13+05:30 IST
మిలీనియల్ ఎన్నారై ఇన్వెస్టర్లు భారత్లోని కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లోనూ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఎమ్వైఆర్ఈ క్యాపిటల్ ఆర్థిక సంస్థ చేపట్టిన సర్వేలో తాజాగా వెల్లడైంది.
ఎన్నారై డెస్క్: విదేశాల్లో రెండు చేతులా సంపాదిస్తున్న అనేక మంది ఎన్నారైలు స్వదేశంలోనూ పెట్టుబడి పెట్టేందుకు మొగ్గుచూపుతారన్న విషయం తెలిసిందే. ఇక ఆర్థికాంశాల పట్ల అవగాహన అధికంగా ఉన్న ఆధునిక తరం ఎన్నారైలు తమ పెట్టుబడుల విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. భారత్లోని డెట్, ఈక్విటీ, బంగారం..ఇలా భిన్న పెట్టుబడి సాధనాల్లోకి తమ సంపాదన మళ్లించి మంచి రాబడులు ఆర్జిస్తున్నారు. అయితే.. మిలీనియల్ ఎన్నారై ఇన్వెస్టర్లు భారత్లోని కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లోనూ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఎమ్వైఆర్ఈ క్యాపిటల్ ఆర్థిక సంస్థ చేపట్టిన సర్వేలో తాజాగా వెల్లడైంది. మొత్తం 13 దేశాల్లోని 5 వేల మంది ఎన్నారైలపై సంస్థ ఈ సర్వే నిర్వహించింది.
ఎన్నారై రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అమితంగా ఆకర్షిస్తున్న నగరాల్లో.. బెంగళూరు, ముంబై, పూణె నగరాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నట్టు తాజా సర్వేలో తేలింది. ఇతర రియల్ ప్రాజెక్టులతో పోలిస్తే.. కమర్షియల్ రియల్ ఎస్టేట్(సీఆర్ఈ) ప్రాజెక్టుల పట్ల ఎన్నారైలు అధికాసక్తి కనబరుస్తున్నట్టు తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 53 శాతం మంది సీఆర్ఈలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపగా.. ఈటీఎఫ్ల పట్ల 21 శాతం మంది, మ్యూచువల్ ఫండ్ల వైపు 19 శాతం మంది మొగ్గు చూపారు. కుటుంబానికి నిరంతర ఆదాయం, పెట్టుబడుల పోర్టోఫోలియోలో విభిన్నత పాటించడం, మెరుగైన రాబడులు ఇచ్చే ప్రత్యామ్నాయాలు లేకపోవడం, రాబడిపై పన్నుల భారం తక్కువగా ఉండటం తదితర కారణాల రీత్యా ఎన్నారైలు సీఆర్ఈ పెట్టుబడుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని ఈ సర్వే తేల్చింది.