మార్చి 16న భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2022-03-11T22:55:09+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాల్లో బాబాసాహేబ్ అంబేద్కర్, షహీద్ భగత్ సింగ్ ఫొటోలు మాత్రమే ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఇకపై ముఖ్యమంత్రుల ఫొటోలు కూడా ఉండవని స్పష్టం చేశారు. వాటి స్థానంలో స్వాతంత్ర సమరయోధుల ఫొటోలు ఉంటాయని పేర్కొన్నారు..
చండీగఢ్: పంజాబ్లో ఆప్ ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవికి లైన్ క్లియన్ చేసుకున్న ఆప్ నేత భగవంత్ మాన్.. మార్చి 16న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు. రాజ్ భవన్లో కాకుండా భగత్ సింగ్ పుట్టిన ఖత్కర్ కాట్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఎన్నికల ఫలితాల విడుదల అనంతరమే భగవంత్ మాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకార తేదీ కూడా ప్రకటించడంతో ఖత్కర్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మార్చి 13న అమృత్సర్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయోత్సవ ర్యాలీ తీయనుంది. దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ఇకపోతే, గురువారం ఫలితాలు విడుదల అనంతరం భగవంత్ మాన్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో బాబాసాహేబ్ అంబేద్కర్, షహీద్ భగత్ సింగ్ ఫొటోలు మాత్రమే ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఇకపై ముఖ్యమంత్రుల ఫొటోలు కూడా ఉండవని స్పష్టం చేశారు. వాటి స్థానంలో స్వాతంత్ర సమరయోధుల ఫొటోలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుతానని భగవంత్ మాన్ వెల్లడించారు. 117 నియోజకవర్గాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 92 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.