ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి
ABN , First Publish Date - 2022-05-23T06:23:30+05:30 IST
దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతిని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో భాగ్యరెడ్డి చిత్రపటానికి జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావుతోపాటు అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
సిరిసిల్ల, మే 22 (ఆంధ్రజ్యోతి): దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతిని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో భాగ్యరెడ్డి చిత్రపటానికి జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావుతోపాటు అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్ వంటి మహానీయుల ఆశయాలను సాధించేందుకు దళితుల్లో ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు వంటి గొప్ప పథకాలను అమలు చేస్తున్నారన్నారు. భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ సంస్థానంలో దళిత బాలికల పాఠశాలను స్థాపించి విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. అంటరాని కులాల ఉద్ధరణకు మన్య సంఘాన్ని ఏర్పాటు చేశారన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ సామాజిక వివక్షపై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అన్నారు. వారి జీవితం అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందన్నారు. స్వాతంత్య్రం రాకముందే సమాజంలో నెలకొని ఉన్న వివక్షతలు, అసమానతలు, మూఢనమ్మకాలపై గళమెత్తి పోరాటం చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి భాస్కర్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి వినోద్కుమార్, సిరిసిల్ల తహసీల్దార్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.