Dallas: డాలస్‌లో మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించిన భారత్ బయోటెక్ ఎండీ

ABN , First Publish Date - 2022-09-10T15:52:33+05:30 IST

ప్రముఖ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, భారత్ బయోటెక్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కృష్ణ ఎల్ల డాలస్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారకస్థలిని సోమవారం సందర్శించారు.

Dallas: డాలస్‌లో మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించిన భారత్ బయోటెక్ ఎండీ

పద్మభూషణ్ డా. కృష్ణ ఎల్ల, నాట్కో ఫార్మాస్యుటికల్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు డాలస్‌లో మహాత్మాగాంధీకి నివాళి

డాలస్, టెక్సాస్: ప్రముఖ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, భారత్ బయోటెక్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కృష్ణ ఎల్ల డాలస్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారకస్థలిని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. డా. కృష్ణ ఎల్ల మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ప్రపంచ శాంతిదూతకు డాలస్ నగరంలో నివాళులర్పించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలిని నిర్మించడంలో తీవ్ర కృషి చేసిన మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూరకు, వారి కార్యవర్గ సభ్యులకు, స్థానిక ప్రవాస భారతీయులకు, ప్రభుత్వ అధికారులకు అభినందనలు తెలిపారు. 


“కోవిడ్ -19తో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతున్న పరిస్థితులలో మన తెలుగుగడ్డమీద కోవ్యాక్సిన్‌ను కనిపెట్టి 4 బిలియన్లకు పైగా టీకా డోసులను 123 దేశాలకు సరఫరా చేసి మానవాళికి సేవ చేసిన మానవతామూర్తి, ప్రముఖ శాస్త్రవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కృష్ణ ఎల్ల, నాట్కో ఫార్మాస్యుటికల్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు డాలస్ నగరంలో గాంధి స్మారక స్థలిని సందర్శించి పుష్పాంజలి ఘటించడం సముచితంగా ఉంది. అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు” అని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర అన్నారు. 


నాట్కో ఫార్మాస్యుటికల్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు మాట్లాడుతూ.. అమెరికాలో (ఇర్వింగ్ నగరంలో) 18 ఎకరాల సువిశాల ఉద్యానవనంలో మహాత్మాగాంధీ స్మారక స్థలిని ఇంత భారీ స్థాయిలో చాలా పరిశుభ్రంగా, పవిత్రంగా నిర్వహించడం చాలా సంతోషం అన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల, బోర్డు ఆఫ్ డైరెక్టర్ మురళి వెన్నం, పారిశ్రామికవేత్త బ్రహ్మాజీ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-10T15:52:33+05:30 IST