ఘంటసాల అంటే తెలుగు పాటల సౌధానికి పునాది: ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్

ABN , First Publish Date - 2022-09-15T00:55:03+05:30 IST

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే

ఘంటసాల అంటే తెలుగు పాటల సౌధానికి  పునాది: ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే. శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో 190 టీవీ చర్చ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమం, 10 మంది సహ నిర్వాహకులు అయిన రత్న కుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, శ్యాం అప్పాలి, విజు చిలువేరు, నీలిమ గడ్డమణుగు ,  రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, జయ పీసపాటి, శ్రీలత మగతలతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులతో  ఘంటసాల శత గళార్చన కార్యక్రమంను నిర్వహించగా..  మొదటి మూడు భాగాలు 21, 28 ఆగస్టు, 4 సెప్టెంబర్ నాడు ప్రసారం చేయగా అనూహ్యమైన స్పందన వచ్చింది. 11 సెప్టెంబర్ నాడు చివరి భాగం ప్రసారం చేశామని నిర్వాహకులు తెలిపారు.


ముందుగా బాల రెడ్డి ఇందూర్తి.. శత గళార్చన నాల్గవ (చివరి) భాగంలో పాల్గొన్న ముఖ్యఅతిథి ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్‌ను పరిచయం చేసి మాట్లాడవలసిందిగా కోరారు. అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ..‘‘ఘంటసాల అంటే తెలుగు పాటకి  చిరునామా మాత్రమే కాదు తెలుగు పాటల సౌధానికి పునాది లాంటి వారు.. ఘంటసాల గొంతు మోగిన తరువాతే తెలుగు పాట  ప్రపంచ వ్యాప్తం అవ్వడం మొదలయ్యింది... అలాగే జర్మనీ లాంటి తెలుగుకి ఏ మాత్రము సంబంధం లేని దేశాలలో కూడా ఆయన ప్రదర్శన అక్కడ ప్రజల్ని ఆకట్టుకుంది. అంటే అది తెలుగు బాషాకి ఎంత ఔన్నత్యం ఉందో తెలుగు బాషాని ప్రాచుర్యం చేసిన ఆయన గొంతుకి కూడా ఉన్నతి, ఆ ఘనత దక్కుతుందని నా అభిప్రాయము. నా చిన్నప్పటి నుండి ఘంటసాల పాటలు వింటూ పెరిగానని వారి పాటలలో నేను బాగా గమనించింది ఏమిటంటే పాటలకు చమత్కారం జోడించి పాడటం అనేది అది వారికొక్కరికే సాధ్యమయ్యింది’’ అని తెలిపారు. 


‘‘నిజంగా ఇలాంటి గాయకుడు ఉండటం వల్లనే తెలుగు భాష ఇంత పరిఢవిల్లుతుంది అని అనిపించింది.  ఘంటసాల పుష్పవిలాపం, కుంతి విలాపం, గోవిలాపం గాని పద్యాలు మనం వింటే చదువుతున్నప్పుడు ఆ పద్యంలోని భావం అర్థం కొంతవరకు అవగతం అవుతుందేమో కానీ వారు పాడుతున్నప్పుడు భావం, అర్థంతో పాటు కవిలోని ఆర్ద్రత కూడా ఆవిష్కృతమైంది. ఇలాంటి గాయకుడు దొరకడం తెలుగు వారిగా మన అదృష్టం.. ఇలాంటి గాయకుడు పాడిన బాషాని విని అర్థం చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం, అటువంటి గాయకుడు నభూతో నభవిష్యత్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు..మా నాన్నగారి తరంలో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఘంటసాల పాటలు విన్నా వాళ్ళ కళ్ళు చెమరుస్తాయి. అలాగే గర్వంగా మన తరువాత తరం వాళ్ళు కూడా ఘంటసాల పాటలు వినిపిస్తూ మన తెలుగు ఇలాంటిదే అని చెప్పడానికి ఆస్కారం ఉంది. చరిత్రలో ముగ్గురే ముగ్గురు వ్యక్తులు వాళ్ళు మరణిస్తూ కూడా భవిష్యత్ తరాలకు లాభాలు చేకూర్చిన వారు ఉన్నారు, ఒకరు భీష్ముడు తనకు తెలిసిన ధర్మార్ధ శాస్త్రాల అన్నిటి సారాన్ని కొన్ని వేల శ్లోకల్లా రూపంలో అందిస్తే, తరువాత ఆరుద్ర  సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర అనే ఒక అద్భుతమైన పరిశోధన గ్రంధాల సమూహాన్ని అయన రచించి మన తెలుగు జాతికి వదిలి వెళ్లారు..  ఆ కోవలోకి చెందిన మూడవ వ్యక్తి ఘంటసాల.. మన బాషా ధర్మానికి భారతీయ సంస్కృతికి ఆయువుపట్టుగా వున్న సాహితీ సంపదలో సారాంశాన్ని అంతటిని ఒకచోట చేరవేసిన భగవద్గీతని, వాటిలోని ముఖ్యమైన శ్లోకాల్ని ఆర్ద్రంగా, కర్ణభేయంగా, భావగర్భితంగా ఆలపించి, ఇక కొన్ని వందల వేల సంవత్సరాలు వరకు సరిపడా పనిచేసాను అని సంతృప్తితో ఆయన ఈ లోకం నుంచి నిష్క్రమించడం జరిగింది.. ఇలాంటి వ్యక్తి గురుంచి తలుచుకోవడం మనకు పుణ్యం.. ఒకొక్కసారి గత వైభవ స్ఫురణ ప్రస్తుత కర్తవ్యానికి ప్రేరణ అవుతుంది అని అంటారు.  అలా వారి గత వైభవాన్ని మనము స్ఫురించుకొంటూ ప్రస్తుత మన కర్తవ్యాన్ని స్ఫూర్తి పొందాలని ఆశిస్తూ, మీరందరు ఎంత బలంగా కోరుకుంటున్నారో, మనందరిది ఎంత బలమైన సంకల్పమో ఘంటసాలకు భారతరత్న రావాలని అనేది,  ఈ సంకల్పం అతిసమీపంలోనే సత్యం అవ్వాలని ఆశిస్తూ  ఆకాంక్షిస్తూన్నాను’’ అని తెలియజేసారు.


శత గళార్చన నాలుగు భాగాల స్వాగతోపన్యాసంతో మనల్ని అలరించిన శారద ఆకునూరి (హ్యూస్టన్, USA) గారు , ఈ చివరి భాగంలో  తన  బృందం నుంచి వరప్రసాద్ బాలినేని, పేరూరి వెంకట సోమశేఖర్, కృష్ణ నాలాది, రాజశేఖర్ సూరిభొట్ల, సురేష్ ఖాజా, జ్యోతిర్మయి బొమ్ము, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, రమణ జువ్వాది, సత్యనారాయణ ఉల్మురి, ఉష మోచెర్ల,  పాల్గొని ఘంటసాల పాటలు పాడి ఘంటసాల గారిని స్మరించుకున్నారు.


ఈ కార్యక్రమములో శ్యామ్ అప్పాలి (లాస్ ఏంజెలెస్, USA) బృందం నుంచి సాయి కాశీభొట్ల, శ్రీనివాస్ రాణి, ప్రసాద్ పార్థసారధి, సుధాకర్ పంగనామముల, వర్మ అల్లూరి, శ్రీహర్ష, శ్రీవల్లి శ్రీధర్, శ్రీయాన్ కంసాలి, ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల,  అనూష వెన్నల, గౌరిధర్ మధు, రాజ్యలక్ష్మి వుదాతు, మీనాక్షి అనిపిండి, శాంత సుసర్ల, రఘు చక్రవర్తి, శ్రీధర్ జూలపల్లి, హరీష్ కొలపల్లి, నారాయణరెడ్డి ఇందుర్తి, వంశీకృష్ణ ఇరువరం పాల్గొని ఘంటసాల పాటలు పాడి మరియు వారిని స్మరించుకుంటూ అలరించారు.    శ్యాం అప్పాలి శత గళార్చన 4 భాగాలకు సాంకేతిక సహాయాన్ని కూడా అందించారు.


శతగళార్చన కార్యక్రమంపై ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, వారి కోడలు కృష్ణ కుమారి మాట్లాడుతూ ముందుగా" ఘంటసాల కు భారతరత్న" కోసం కృషి చేస్తున్న 33 దేశాల నుంచి 119 మంది పాల్గొనడం చాలా సంతోషం కలిగిందని, వారందరికీ మా ప్రత్యేక  ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. అలాగే విశిష్ట అతిధులుగా విచ్చేసిన  ప్రముఖ దర్శకుడు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, ప్రముఖ గేయ రచయితలు చంద్రబోస్ మరియు అనంత శ్రీరామ్ తదితరులుకు పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారములు తెలియ చేసుకుంటున్నాము. చివరిగా ఇన్ని కార్యక్రమాలను విజయవంతం నిర్వహించిన బాలరెడ్డి  ఇందుర్తి, సింగపూర్ రత్న కుమార్ కవుటూరు ధన్యవాదములు తెలియచేసారు.  


శత గళార్చన కు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని. చాలా మంది ప్రముఖులు "ఘంటసాల గారికి భారతరత్న" విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు.  


ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru వెబ్‌సైట్ చూడాలని కోరారు.  ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఘంటసాల కుటుంబ సభ్యులకు, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ బాలరెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటే ghantasala100th@gmail.com అడ్రస్‌కు వివరాలు పంపగలరు.



Updated Date - 2022-09-15T00:55:03+05:30 IST