Ghantasala: నమో వెంకటేశా నమో తిరుమలేశా పాటతో నిద్రలేచేవాళ్ళం: గేయ రచయత చంద్రబోస్

ABN , First Publish Date - 2022-09-10T02:33:10+05:30 IST

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే.

Ghantasala: నమో వెంకటేశా నమో తిరుమలేశా పాటతో నిద్రలేచేవాళ్ళం: గేయ రచయత చంద్రబోస్

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు(Ghantasala) శత జయంతి వేడుకలు సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే. శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో పలు టీవీ చర్చ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమం, 10 మంది సహ నిర్వాహకులు అయిన రత్న కుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, నీలిమ గడ్డమణుగు, శ్యాం అప్పాలి, విజు చిలువేరు, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, జయ పీసపాటి, శ్రీలత మగతల తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులతో  ఘంటసాల శత గళార్చన కార్యక్రమాన్ని నిర్వహించగా..  మొదటి రెండు భాగాల్ని 21, 28 ఆగస్టు నాడు ప్రసారం చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని, 4 సెప్టెంబర్ నాడు మూడవ భాగం ప్రసారం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.  చివరి భాగం 11 సెప్టెంబర్ లో ప్రసారం చేయబడుతుంది.


ముందుగా శారద ఆకునూరి.. శతగళార్చన మూడవ భాగంలో పాల్గొన్న ముఖ్యఅతిథి చంద్రబోస్‌ను పరిచయం చేసి మాట్లాడవలసిందిగా కోరారు. చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘‘ఘంటసాల శత జయంతి వేడుకలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మాస్టర్ గారికి భారతరత్న కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రణామములు, ఘంటసాల గురించి చెప్పే అర్హత గాని, అనుభవం కానీ నాకు చాలదు, అయినా కానీ వారిపైన నాకున్న అపార గౌరవంతో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘మా ఊరిలోని శివాలయంలో ఉదయాన్నే మొట్టమొదటిగా  వినపడే పాట నమో వెంకటేశా నమో తిరుమలేశా అని, ఆ పాటతోనే నేను, మా ఊరి వారందరు మేలుకుంటారు’’ అని తెలిపారు.  


‘‘అలాగే సాయంత్రం 7 గంటలకు మళ్ళి అదే నమో వెంకటేశా,  నమో తిరుమలేశా పాటతోనే అందరూ నిద్రపోవడం ... అంటే ఆ పాట మా అందరికి మేలుకొలుపు అలాగే జోలపాట. తరువాత మాస్టారు గురించి  ఈ సందర్భంగా  ఇంకొక విషయం ప్రత్యేకంగా చెప్పాలి .. అదేమిటంటే ఆయన పాటలు పాడకముందూ వారు జాతీయోద్యమంలో పాల్గొన్నారు, జైలుకు వెళ్లి జైలు జీవితం గడిపారు.. దేశభక్తి , మాతృ భూమి మీద అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తికి, ఎంత నిజాయితీ, ఎంత నిబద్ధత, ఎంత క్రమశిక్షణ, ఎంతో అంకితభావం ఉంటాయో మనకి తెలుసు. అలాంటి వ్యక్తికి  అలాంటి నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావానికి సంగీతం తోడైతే అది ఘంటసాల మాస్టారు... ఇంకా మాములుగా సినిమా రంగంలో నేపధ్య గానానికి అంత చరిత్ర లేదు... 1944 వరకు పాత్రధారులే వారి వారి పాత్రలకు పాటలు పాడేవారని.. మొట్టమొదటి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు గారు అయితే, వారి తరువాత 1945 లో స్వర్గసీమ చిత్రం తో మొదలుపెట్టి  - 1974 వరకు అలా అప్రతిహతంగా మాస్టారు గారి ప్రయాణం సాగింది అని పేర్కొన్నారు. 


‘‘జాతీయోద్యమ గీతాలు, జానపద గేయాలు, లలిత గీతాలు, సినిమా పాటలు, పద్యాలు, భగవద్గీత... ఇంత గొప్ప ప్రయాణం మాస్టారు గారిది. ఈ మధ్యలో చాలా  పాటలు రాస్తున్న నా ఆత్మ సంతోషం కోసం, సంతృప్తి కోసం కొన్ని మాస్టారు గారి పద్యాలు పాడుకుంటాను... అందరి కోసం మాస్టారు పాడిన పుష్ప విలాపంలోని కొన్ని పద్యాలు రాగయుక్తంగా పాడి ప్రేక్షకులను అలరించారు.. చివరిగా మాస్టారు గురించి చెబుతూ పద్యానికి ఆత్మని జోడించారు, పాటకు హృదయాన్ని మిళితం చేశారు.. అలాంటి ఘంటసాల గారికి భారతరత్న రావడం కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రణామములు’’ అని తెలియచేసారు. 


అలాగే శారద ఆకునూరి (హ్యూస్టన్, USA) బృందం నుంచి భాస్కర్ గంటి, నాగార్జున రెడ్డి, శ్రీనివాస్ గూడూరు, రవి తుపురాని పాల్గొని ఘంటసాల పాటలు పాడి ఘంటసాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమములో ఫణి డొక్కా (అట్లాంటా, USA) బృందం నుంచి శృతి వనమాల గుంటపల్లి, నీహార్ కపిల, శిల్ప ఉప్పులూరి, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకర్ దర్భా, రవి కామర్సు పాల్గొని ఘంటసాల పాటలు పాడి అలరించారు.  డాక్టర్ రెడ్డి ఉరిమిండి (డల్లాస్, USA) బృందం నుంచి శ్రీనివాస్ ఇయ్యుణ్ణి, మురళి హనుమంతకారి, ప్రభాకర్ కోట, ఆషా కీర్తి లంకా, ప్రత్యూష మందడపు, పరిమళ మార్పాక, జానకి శంకర్, వీణ యలమంచిలి ఘంటసాల పాటలు పాడి, చక్కటి వ్యాఖ్యానంతో ఘంటసాలని స్మరించుకున్నారు. 


ఈ కార్యక్రమములో పాల్గొన్న మరికొందరు ప్రముఖులు ఆదిషేషు కోట, దాము గేదల, రమేష్ వల్లూరి, మధు అన్న, రాజషేఖర్ రెడ్డి ఐల, చిమట శ్రీనివాస్, విజయ సారధి జీడిగుంట, సంతోష్ ఆకునూరి పాల్గొని చక్కని పాటలతో అందరిని అలరించారు. శతగళార్చన చివరి భాగంలో ముఖ్య అథిది అనంత శ్రీరామ గారు పాల్గొంటారని నిర్వాహకులు తెలియ చేసారు. శతగళార్చనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని, చాలా మంది ప్రముఖులు "ఘంటసాలగారికి భారతరత్న" విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు. 


ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు.  పూర్తి వివరాల కోసం https://www.change.org/BharatRatnaForGhantasalaGaru వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.  ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఘంటసాల కుటుంబ సభ్యులకు, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ బాల రెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటే  ghantasala100th@gmail.com మెయిల్‌కు వివరాలు పంపాలని సూచించారు.  

Updated Date - 2022-09-10T02:33:10+05:30 IST